మెదక్ అర్బన్/ సంగారెడ్డి అర్బన్, జూలై 1: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు అనుగుణంగా సేవలు అందజేస్తున్నది. ఇప్పటికే కార్గో సేవలతో ప్రజలకు చేరువ కాగా, మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ ద్వారా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనం టికెట్ను పొందేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఎంతో మందికి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి టికెట్లు దొరకడంలేదు. కానీ, టీఎస్ఆర్టీసీ తిరుమలకు ప్రయాణించే భక్తుల కోసం ప్రతిరోజు 1000 మందికి అవకాశం కల్పిస్తూ బస్ టికెట్తో పాటు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ప్రయాణికుల కోసం టీటీడీ వారి సమన్వయంతో అందుబాటులోకి తీసుకువచ్చింది. టీఎస్ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకొని టీఎస్ఆర్టీసీలో ప్రయాణించే భక్తులకు మాత్రమే ప్రత్యేక దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనం టికెట్లు ప్రారంభించారు.
ఈ ప్రత్యేక టికెట్ల కోసం ఏడు రోజుల ముందుగా భక్తులు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ www.tsrtconlinw.in ద్వారా లేదా టీఎస్ఆర్టీసీలో ఉదయం 10 గంటల నుంచి టైమ్ స్లాట్లో బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. టీఎస్ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులకు ఎటువంటి వసతి, ఫలహారాలు గానీ అందించబడవు. దర్శన టికెట్లను మాత్రమే భక్తులకు అందిస్తుంది. భక్తులు దర్శనం అనంతరం తిరుమల తిరుపతి నుంచి తిరుగు ప్రయాణానికి కూడా టీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారానే బుకింగ్ చేసుకోవాలి. భక్తులు టీఎస్ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న దర్శన టికెట్, బస్సు టికెట్లను వాయిదా వేయడం, రద్దు చేసుకోవడం వంటి అనుమతించరు. భక్తులు 12 సంవత్సరాల్లోపు పిల్లలకు మాత్రమే ఉచిత దర్శనానికి అనుమతి ఉంటుంది. మెదక్ నుంచి తిరుమలకు వెళ్లే బస్సు ప్రతిరోజు శంకరంపేట్(ఆర్), చేగుంట, తూప్రాన్, మేడ్చల్, జేబీఎస్ల మీదుగా తిరుమల బయలుదేరుతుంది. మరిన్ని వివరాలకు 040-23450033, 040-69440000 సంప్రదించాలి. అలాగే, సంగారెడ్డి బస్ స్టేషన్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు బస్సు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వివినియోగించుకోవాలని కోరారు.
టీఎస్ ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా వేంకటేశ్వరస్వామి దర్శనం లభిస్తుంది. ప్రయాణికులు టీఎస్ ఆర్టీసీ ద్వారా ప్రత్యేక దర్శన టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. – ఆర్టీసీ మెదక్ డీఎం ప్రణీత్కుమార్, సంగారెడ్డి డీఎం సత్యనారాయణ