గుమ్మడిదల, డిసెంబర్ 13 : కేరళలోని శబరిమలైలో ఉన్న వసతులు బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయంలోనూ ఉన్నాయి. అయ్యప్ప భక్తులు ఇక్కడే ఇరుముడులు కట్టుకుని దీక్షలు విరమించే వసతులు ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లి-వీరన్నగూడెంలో 35 ఏండ్ల క్రింతం వెలసిన అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నారు. 35 ఏండ్ల క్రింతం బొంతపల్లి గ్రామానికి చెందిన సురభి నాగేందర్గౌడ్, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, కుమార్గౌడ్ తదితర వందలాది మంది భక్తులు వీరన్నగూడెం-బొంతపల్లి పంచాయతీ శివారులో అయ్యప్పస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కేరళలోని శబరిగిరి కొండలో వెలసిన అయ్యప్పస్వామి మూలవిరాట్టును పోలి న అయ్యప్పస్వామి విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. దీంతోపాటు పక్కనే సాయిబాబా మందిరం, శరభలింగేశ్వరస్వామి దేవాలయం, నవగ్రహాలు, అభయాంజనేయస్వామి ఆలయం, బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయాలు ఉన్నాయి.
శబరిగిరికొండలో పోలిన పదునెట్టాంబడి..
కార్తికమాసంలో అయ్యప్పస్వామి దీక్షలు చేపట్టిన స్వాములు ఇరుముడులు నెత్తిన పెట్టుకొని శభరిగిరి కొండకు వెళ్లి దీక్షలు విరమిస్తారు. వీరన్నగూడెంలో అయ్యప్పస్వామి దేవాలయంలో పదునెట్టాంబడి మెట్లను ఏర్పాటు చేయడంతో ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. దీక్షలు విరమించే స్వాములు పదునెట్టాంబడి మెట్లు అధిరోహించి స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
ఈనెల 15న ఆలయ వార్షికోత్సవం..
ఈనెల 15న బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. బుధవారం అయ్యప్పస్వామివారికి గణపతి హోమం, అష్టాభిషేకాలు, గౌరీపూజ, ఆభరణాల ఊరేగింపు, ఆరట్టు, మహిషి మర్ధనం, దివ్య మహాపడిపూజ వైభవంగా నిర్వహించనున్నారు.
కరోనా వైరస్ ప్రభావంతో దీక్షల విరమణకు సన్నాహాలు..
కరోనా వైరస్ నేపథ్యంలో కేరళలోని అయ్యప్పస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లలేని భక్తు లు బొంతపల్లిలోని దేవాలయంలో దీక్షలు విరమిస్తారు. జంట నగరాలైన హైదరాబాద్-సికింద్రాబాద్, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఉన్న పదునెట్టాంబడి మెట్లను ఇరుముడులతో అధిరోహిస్తూ అయ్యప్పస్వామి మూలవిరాట్టును దర్శించుకొని ఇరుముడులు స్వామి వారికి సమర్పించుకోనున్నారు. ఆలయ వార్షికోత్సవానికి అన్ని ఏర్పా ట్లు చేసినట్లు వీరభద్ర అయ్యప్ప సాయి సేవా సమితి కమిటీ సభ్యులు వెల్లడించారు.