సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/అందోల్: బీజేపీలో గ్రూ పు రాజకీయాలు బయటపడుతున్నాయి. ఆ పార్టీలో ఇప్పటి నుంచే టికె ట్ల పంచాయితీ నడుస్తున్నది. ఒకరి ఒకరు నేతలు బల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ సమావేశాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నా యి. ప్రధాని నరేంద్రమోడీ సికింద్రాబాద్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గురువారం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశాలు బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలకు దారితీశాయి. నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ సమావేశాలతో బయటకు పొక్కాయి.
ఎమ్మెల్యే ఆశావహులు పార్టీ ఇన్చార్జీల ఎదుట బలప్రదర్శనకు దిగడం అంతర్గత విబేధాలకు దారితీస్తోంది. సంగారెడ్డి జిల్లాలో అందోలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం గురువారం రసాభసాగా మారింది. మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, మాజీ జడ్పీచైర్మన్ బాలయ్య అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అందోలు నియోజవకర్గ ఇన్చార్జి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్జీ శుక్లా ఎదుటే బాబూమోహన్, బాలయ్య వర్గీయులు ఘర్షణకు దిగారు. సొంత పార్టీ నాయకులే పరస్పరం బాహాబాహీకి దిగడంతో ఇన్చార్జి ప్రేమ్జీ శుక్లా అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఈనెల 3న జరిగే నరేంద్రమోడీ బహిరంగ సభకు జనసమీకరణ చేపట్టేందుకు బీజేపీ సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు జరుపుతున్నది. గురువారం అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయి. అందోలు నియోజకవర్గంలో పార్టీ సమావేశం జోగిపేట పట్టణంలో జరిగింది. ఈ సమావేశానికి ఇన్చార్జి ప్రేమ్జీ శుక్లా, ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఆలె భాస్కర్, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య తదితరులు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి మాజీ జడ్పీ చైర్మన్ అనుచరులు తమ నాయకుడు బాలయ్యను వేదిక మీదికి ఆహ్వానించలేదని గొడవకు దిగారు. బాలయ్య అనుచరులు బాబూమోహన్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆగ్రహించిన బాబూమోహన్ మద్దతుదారులు బాలయ్య డౌన్డౌన్ అంటూ నినాదాలు మొదలు పెట్టారు. ఇరువర్గాలకు చెందిన మద్దతుదారులు నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగారు.
ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం గొడవ పడడంతో చేసేది ఏమీలేక పార్టీ ఇన్చార్జి ప్రేమ్జీ శుక్లా వెళ్లిపోయారు. కాగా, అక్కడే ఉన్న పార్టీ ఓబీసీ మోర్చా కన్వీనర్ ఆలే భాస్కర్ బాబూమోహన్, బాలయ్య వర్గీయులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. రెండు వర్గాల వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై మాజీ జడ్పీ చైర్మన్, బీజేపీ నాయకుడు బాలయ్య మాట్లాడుతూ.. అవమానించాలన్న ఉద్దేశంతోనే వేదికపైకి తనను ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తాను పోటీ పడుతుండటం నచ్చకే తనను, తన అనుచరులను అవమానించేలా కొంత మంది వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ సమావేశాలకు పలువురు నాయకులు దూరంగా ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ప్రతాప్రూడీ హాజరయ్యారు. కాగా, ఈ సమావేశానికి నియోజకవర్గ ముఖ్య నాయకులు సంగప్ప, సంగమేశ్వర్రెడ్డి గైర్హాజరయ్యారు. జహీరాబాద్లో నిర్వహించిన సమావేశానికి అతి తక్కువ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి మీడియాను దూరం పెట్టారు.