కౌడిపల్లి, జూన్ 30: ఆడపిల్లలు బాగా చదివితేనే ఆ కుటుంబానికి గౌరవం దక్కుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్రెడ్డి, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. గురువారం కౌడిపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ సీడీపీవో హేమభార్గవి ఆధ్వర్యంలో టీఎస్సీడీడబ్ల్యూ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ లింగ వివక్షపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న చట్టాలపై గ్రామీణ స్థాయిలో విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. మెదక్ జిల్లాలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టినప్పుడే ఆడపిల్లలకు విముక్తి లభిస్తుందని అన్నారు. 14 ఏండ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో చాలావరకు మహిళలపై దాడులు తగ్గాయన్నారు. రాష్ట్రంలో 60 శాతం 18 నుంచి 20 ఏండ్ల వయస్సున్న వారి మిస్సింగ్ కేసులు వస్తున్నాయన్నారు.
ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి
ప్రేమ పేరిట మోసం చేసి వారిని తీసుకెళ్లి అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య దశ చాలా గొప్పదని, విద్యార్థి దశలోనే మంచి క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. జిల్లాలో శిశు విక్రయాలు తగ్గాయని, మహిళల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. బాల్య వివాహాలు పూర్తిగా వీడినప్పుడే మరింత అభివృద్ధి చెందుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనే అమ్మాయిల రక్షణ కోసం స్వీట్ డ్రీమ్స్ కేంద్రాలు ఏర్పాటు చేసి, నేరాలు అదుపులోకి తెచ్చాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్య
బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించేలా అధికారులు కృషి చేయాలని డీఈవో తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన అందిస్తున్నామన్నారు. పదో తరగతి ఫలితాల్లో మెదక్ జిల్లా 11వ స్థానంలో ఉందని డీఈవో తెలిపారు.
రోడ్లపై కేజీవీల్స్ నడపొద్దు
గ్రామీణ ప్రాంతాల్లో కేజీవీల్స్ రోడ్లపై నడపడంతో కోట్ల రూపాయలతో వేసిన రోడ్లన్నీ నాశనం అవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. వాహనదారులు ఎవరైనా సరే ఎంత రిక్వెస్ట్ చేసినా సహించకుండా ప్రతి ఒక్కరికీ రూ.10వేల జరిమానా విధిస్తూ కేసులు నమోదు చేయాలని ఎస్పీకి తెలిపారు. వీటిపై చర్యలు తీసుకునేలా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు ఆదేశించాలని కోరారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. అనంతరం ఉచితంగా నోటుబుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఆర్ఈఎస్ సెక్రటరీ సునీత, బిడబ్ల్యూవో గీత, డీఈవో రమేశ్ కుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, గ్రంథాలయాల చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ కవిత, ఎంపీడీవో భారతి, ఎంపీటీసీలు, ఎస్సై శివప్రసాద్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ
కొల్చారం, జూన్ 30: మండలంలోని కొంగోడులో నీటి గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం కొంగోడు గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థుల మృతి రెండు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఒకే రోజు జన్మించిన ఇద్దరు, అన్నదమ్ములు ఒకే రోజు చనిపోవడం బాధ కలిగించిదన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కలెక్టర్తో మాట్లాడి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. ఆమె వెంట ఎంపీపీ మంజుల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ ఉదయ, నాయకులు వెంకట్గౌడ్, కాశీనాథ్ ఉన్నారు.