కంది, డిసెంబర్ 7: అతడిది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పేదింటి కుటుంబమైనా తమ పిల్లలను ఉన్నత చదువు చదివించాలన్నా ఆ తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నలుగురు సంతానం ఉన్న ఆ తల్లిదండ్రులకు చివరి సంతానమైన తన చిన్న కొడుకు ఐఐటీ హైదరాబాద్లో సీటు సంపాదించాడు. ఇన్నేండ్లు తన కొడుకు పడ్డ కష్టమంతా ఈ ఒక్క అవకాశంతో అవన్నీ తీరిపోయానని ఆనందం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండలంలో నివాసముంటున్న విఠ్లావత్ వినోద్ కుమార్ జిల్లాలో మొదటి సారిగా సీటి దక్కించుకుని జిల్లాకే పేరు తెచ్చిపెట్టాడు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి…
సంగారెడ్డి మండలం హనుమానగర్కు చెందిన విఠ్లావత్ గణేశ్- దస్లీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకు ఉన్నారు. 20 ఏండ్లుగా ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు. కూమార్తెలు సోని, అనూషకు వివా హం చేశారు. పెద్ద కుమారుడు సాయికుమార్ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చేస్తున్నారు. చిన్నకొడుకు విఠ్లావత్ వినోద్కుమార్ పదో తరగతి వరకు సంగారెడ్డిలోని గాయత్రి పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. సంగారెడ్డిలోని ఎస్వీ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. గత అక్టోబర్లో ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ కోర్సులకు గాను ఎంట్రెన్స్కు విద్యార్థుల నుంచి దరఖాస్తులకు కోరారు. ఐఐటీలో సీటు దక్కాలంటే మొదటగా జేఈఈ మెయిన్స్ తోపాటు జేఈఈ అడ్వాన్స్లో మంచి ర్యాకింగ్ సాధించాలి. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలో లక్షల్లో విద్యార్థులు పాల్గొంటారు. కేవలం కొంతమందికి మాత్రమే ఇక్కడ సీటు కోసం ఆహ్వానం లభిస్తుంది. ఈ రెండు పరీక్షల్లో వినోద్ కుమార్కు ఓవరాల్గా 955 ర్యాంకు సాధించడంతో (ఎస్సీ) కోటా కింద అతడికి ఐఐటీ హైదరాబాద్లో ఇంజినీరింగ్-ఫిజిక్స్లో సీటు దక్కించుకున్నాడు. అతడితో పాటు ఇదే విభాగంలో దేశంలోని పలు రాష్ర్టాల నుంచి పోటీ పడ్డ మరో 29 మందికి సీటు దక్కింది. సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సారిగా ఇక్కడి విద్యార్థి ఐఐటీ హైదరాబాద్లో సీటు సంపాదించడంపై పలువురు ఆ విద్యార్థికి అభినందలు తెలియజేశారు.
పలువురు నాయకుల అభినందనలు…
ఐఐటీలో సీటు సాధించిన వినోద్కు స్థానిక జానజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణతో పాటు నగేశ్, గణేశ్, శ్రావణ్, ప్రశాంత్యాదవ్, అజయ్ అతడి ఇంటి స్వగ్రామానికి వెళ్లి శాలువా కప్పి సన్మానించి స్వీటు తినిపించి అభినందించారు. వినోద్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. సంగారెడ్డి మండలంతో పాటు జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ప్రజాప్రతనిధులు, ఇతర ఉపాధ్యాయ బృందం సభ్యులు అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులను అభినందించారు.