సిద్దిపేట, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /ఝరాసంగం : “గిట్ల ఎవ్వలివ్వలె.. ఎప్పుడు కూడా సుడలె.. ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకొచ్చి ఎవుసం చేసేటోళ్లం.. ఇయ్యాళ సీఎం కేసీఆర్ సార్.. లాగోడికి పైసలిత్తుండు.. వీటితోని ఇత్తులు, ఎరువులు కొనుక్కుంటం.. గింత మంచిగ ఇత్తున్న సార్కు రుణపడి ఉంటం. సార్ నాకు ఒక ఎకరం భూమి ఉంటే రూ.5 వేల పెట్టుబడి సాయం వచ్చింది. వీటితో ఇత్తనాలు, ఎరువులు కొనుక్కుంటా.. పైసలు తీసుకున్నం సార్.. ఇది మంచి పథకం .. ఇవాళ మాకు లాగోడికి ఇబ్బంది లేదు.. సీఎం సార్కు దండాలు.. అంటూ ఇలా రైతుబంధు పథకంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముక్త కంఠంతో రైతులు సంబురంగా చెబుతున్నారు. తొమ్మిదో విడుత రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. రెండో రోజు రెండెకరాల లోపు రైతులకు డబ్బులు జమ అయ్యాయి. ఇవ్వాల మూడు ఎకరాల లోపు రైతులకు డబ్బులు జమ కానున్నాయి. ఝరాసంగం మండలం కమాల్పల్లిలో బుధవారం గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్రావుపాటిల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాండు, ఈశ్వరప్ప, బర్గయ్య, రైతులు సంగన్న, శేఖర్, బిక్కుసాబ్, బాల్రాజ్, బస్వరాజ్, దశరత్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు.. రైతులకు గొప్ప వరం
రైతు బంధు పథకం రైతులకు గొప్ప వరం లాంటిది. రైతుల కష్టాలను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అనేక విధాలుగా సాయం చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. గతంలో రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే పంటసాగు ప్రారంభంలోనే ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమచేస్తున్నది. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారు.
– వంగ నాగిరెడ్డి, రైతుబంధు సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్
చాలా మంచి పని చేస్తున్నరు..
రైతులు పంటలు పండించేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చి చాలా మంచి పని చేస్తున్నడు. ఇప్పుడు కూడా అప్పులు చేసి నాకు ఉన్న చేనులో పంటలు వేసిన. ఇప్పుడు వచ్చిన రైతుబంధు డబ్బులతో అప్పు తీరుతుంది. రైతుబంధు డబ్బులు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-నరేశ్, పైడిగుమ్మల్ రైతు (కోహీర్ మండలం)
సమయానికి పైసలోచ్చినాయ్..
వ్యవసాయం చేసేందుకు పెట్టుబడి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేసింది. ఒకప్పుడు రైతులు సొమ్ములు గిరిపెట్టి ఎరువులు,విత్తనాలు కొనుక్కునేటోల్లు. ఇప్పుడు ఆ బాధ తీరింది. సీఎం కేసీఆర్ రైతన్నలకు అండగా నిలుస్తూ ఏ ఇబ్బంది లేకుండా చూస్తుండు.
-బంటు శ్రీనివాస్ రైతు పల్పనూర్,హత్నూర