సీఎం కేసీఆర్ పాలనలో పల్లె రోడ్లకు మహర్దశ పట్టింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.79.50లక్షలు, పుల్కల్ మండలం గొంగ్లూరు తండాకు బీటీరోడ్డు నిర్మాణం, మరమ్మతులకు రూ.55 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈసందర్భంగా రెండు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యంలేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తమ గ్రామాలు భవిష్యత్తులో ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యాల్కల్/ పుల్కల్, జూన్ 25: గ్రామీణ రోడ్లకు తెలంగాణ ప్రభుత్వ పాలనలో మహర్దశ వచ్చింది. న్యాల్కల్ మండల పరిధిలోని గణేశ్పూర్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వం ఎస్సీఏడీఎఫ్ పథకం కింద రూ.79.50 లక్షల నిధులను మంజూరు చేసింది. పుల్కల్ మండల పరిధిలోని గొంగ్లూరు తండా బీటీ రోడ్డు నిర్మాణానికి, రెన్యువల్ రూ.55 లక్షలు మంజూరు చేసింది. దీంతో శనివారం గణేశ్పూర్లో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ గౌసొద్దీన్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కిష్టారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి, గొంగ్లూరు తండాలో సర్పంచ్ వాలీబాయ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నిధులు మంజూరు చేసి న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గణేశ్పూర్లో వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు, గొంగ్లూరులో కోలా గోపాల్, వార్డు సభ్యులు కుమార్, కిషన్, సురేశ్, విద్య తదితరులు పాల్గొన్నారు.