వెల్దుర్తి, జూన్25: బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమునా హేచరీస్ పరిశ్రమ పేరుతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో చేసిన భూకబ్జాతో పంట పొలాలను కోల్పోయిన బాధిత రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బాధిత రైతులు శుక్రవారం మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, రజక సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి, న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిని కలిసి బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ వ్యవసాయ భూములను తమకు అప్పగించి, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎంపీ, ఎమ్మెల్యే బాధిత రైతుల వద్దకు వచ్చి ఈ విషయంపై ఆరా తీయగా, ఈటల భూకబ్జా వ్యవహారాన్ని రైతులు ఎంపీకి వివరించి, మా భూములను మాకు అప్పగించి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం..
– ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
సమస్య తెలుసుకున్న అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ బాధిత రైతులు ఆందోళన చెందవద్దని, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేతో కలిసి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం త రఫున పూర్తి సహాయ సహకారాలు అందించి బాధిత రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గతంలో ఇచ్చిన పట్టాల ఆధారంగా ఎవరికి ఎంత భూమి ఉందో, ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు రైతులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
రైతులకు న్యాయం చేస్తాం..
స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడు తూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమునా హేచరీస్ పరిశ్రమ పేరుతో దళిత, బీసీ పేదల భూములను అన్యాక్రాంతం చేశారన్నారు. అచ్చంపేట గ్రామ పరిధిలోని పలు సర్వేనంబర్లలో సుమారు 77.33 ఎకరాల భూములతో పాటు హకీంపేట పరిధిలోని సర్వేనంబర్లో ఎకరన్నర సీలింగ్, అసైన్డ్ భూముల్లో షెడ్ల నిర్మాణాలతో పాటు కబ్జాకు పాల్పడడం, ఇతర వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా జమునా హేచరీస్ పరిశ్రమ యాజమాన్యం అడ్డుకుంటున్నట్లు తెలిపారు. కబ్జాకు పాల్పడిన భూములు పరిశ్రమ యజమానులైన జ మునా, నితిన్రెడ్డి పేరుతో ఉన్నాయన్నారు. కబ్జాకు గురైన భూములను న్యాయపరంగా, గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతులకు తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ తెలిపారు.
అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అధికారులు సర్వేలు నిర్వహించి కబ్జా భూములను గుర్తించారన్నారు. గతంలో నిరుపేద రైతులకు ప్ర భుత్వాలు ఇచ్చిన పట్టాల ఆధారంగా భూములను తిరిగి ఇప్పిస్తామని, త్వరలోనే న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు భూపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, ఆంజనేయులు, వేణుగోపాల్రెడ్డి, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.