నర్సాపూర్, జూన్23: పల్లెలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలంగాణ ప్రభుత్వం భావించింది. సీఎం కేసీఆర్ గ్రామాలపై దృష్టి సారించి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతితో గ్రామాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు భాగస్వాములై పల్లెలను పరిశుభ్రంగా మారుస్తున్నారు. అభివృద్ధి పనులు చేపడుతూ పల్లెల రూపురేఖలు మారుస్తున్నారు. పేరుకుపోయిన చెత్తాచెదారం, ముండ్ల పొదలు, కలుపు మొక్కలు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లతో అధ్వానంగా ఉన్న గ్రామాలు నేడు పల్లె ప్రగతితో కొత్త అందాలను రూపుదిద్దుకుంటున్నాయి.
అభివృద్ధి పథంలో పెద్దచింతకుంట
పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని పెద్దచింతకుంట గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1423. సర్పంచ్ గుండె శివకుమార్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాన్ని అభివృద్ధి బాటలు పట్టించారు. ఒకప్పుడు పెద్దచింతకుంట గ్రామం అపరిశుభ్రతతో కళాహీనంగా ఉండేది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, కలుపు మొక్కలు, శిథిలావస్థలో ఇండ్లు దర్శనమిచ్చేవి. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామం కొత్త అందాలతో కళకళలాడుతున్నది. ప్రభుత్వం ఆదేశించిన ప్రతి పనిని సర్పంచ్ శివకుమార్ చేస్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిపారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ఎంతగానో ఆకట్టుకుంటున్నది. జిల్లాస్థాయి అధికారులు కూడా సర్పంచ్ను అభినందించడం గమనార్హం. వైకుంఠధామం, సెక్రిగేషన్ షెడ్డు, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. వీటితో పాటు తండాలకు సీసీ రోడ్లు వేయించారు. పల్లె ప్రగతిపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, అందరూ భాగస్వాములయ్యేలా సర్పంచ్ శివకుమార్ చైతన్యవంతులను చేశారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలు ఇచ్చి, అందులోనే చెత్త వేయాలని అవగాహన కల్పించారు. గ్రామంలోకి ప్రవేశించగానే రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన హరితహారం చెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. గ్రామంలో మొక్కలు నాటి, వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి, వాటిని సంరక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మురుగు కాల్వలు తీయిస్తూ ఈగలు, దోమల బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యువకుల సహకారంతో ప్రతి ఆదివారం గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశించిన ప్రతి అభివృద్ధి పనిని చేస్తున్నాం. ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి తండాలో సీసీ రోడ్లు వేయించాం. వారి రవాణా ఇబ్బందులు తొలగించాం. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గుడి నిర్మించేందుకు ఎమ్మెల్యే మదన్రెడ్డి రూ.5 లక్షలు మంజూరు చేశారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్న గ్రామస్తులు, పంచాయతీ పాలక వర్గానికి కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే మదన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. – గుండె శివకుమార్, సర్పంచ్, పెద్ద చింతకుంట
గ్రామం చాలా మారింది
తెలంగాణ ప్రభుత్వ హయాంలో మా గ్రామం చాలా మారింది. ఒకప్పుడు అధ్వాన్నంగా ఉండేది. సర్పంచ్ అందరినీ కలుపుకొని గ్రామానికి మంచి పనులు చేస్తున్నాడు. ఊళ్లో కట్టిన పార్కులో కాసేపు కాలక్షేపం చేస్తున్నా. మోరీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. చెత్త బయట వేయకుండా చెత్త బుట్టలు వాడుతున్నారు.
– అంజయ్య, గ్రామస్తుడు, పెద్ద చింతకుంట