న్యాల్కల్, జూన్ 21 : మట్టి అవసరం లేకుండా ఖనిజ పోషకాలను ఉపయోగించి పంటలను (హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతి) పండించడం బాగుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం న్యాలకల్ మండలంలోని ఖలీల్పూర్ గ్రామ శివారులోని లెమన్చిల్లి పాలీహౌస్ను మంత్రి నిరంజన్రెడ్డి సందర్శించి, నిర్వాహకులతో కలిసి హైడ్రోపోనిక్ పద్ధతిలో పండిస్తున్న క్యాప్సికం, కీరా కూరగాయల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న కూరగాయలు, పండ్ల తీరును మంత్రికి లెమన్చిల్లి పాలీహౌస్ మేనేజర్ బ్రహ్మ, మార్కెటింగ్ మేనేజర్ వంశీకృష్ణ వివరించారు. సింగపూర్లో స్థిరపడిన యలమంచి జనార్దన్రావు 2017లో ఇక్కడ 15 ఎకరాల విస్తీర్ణంలో క్రావో స్ట్రక్చర్(అడ్వాన్స్ గ్రీన్ పాలీహౌస్)ను ఏర్పాటు చేశారని, ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద పాలీహౌస్ అని అన్నారు.
వ్యవసాయం చేయాలంటే సారవంతమైన భూమి అవసరముంటుందని, అందులో పోషకాలున్న మట్టి కావాలని, ఇదంతా పాత వ్యవసాయ పద్ధతన్నారు. చేతికి మట్టి అంటే పనిలేదని, వానలు కురవలేదన్న బాధ, కలుపు మొక్కల దిగులు, చీడపురుగుల బెడద అసలే ఉండదన్నారు. ఆధునిక వ్యవసాయ విధానంలో ఒకటైన హైడ్రోపోనిక్ పద్ధతిని అనుసరిస్తూ ఎక్సయోటిక్ కలర్ క్యాప్సికం, ఇంగ్లిష్ కీరా, పుచ్చకాయ, కర్బుజా, జుకునీ, చెర్రీ, టమాట పంటలను ఇక్కడ పండిస్తున్నామన్నారు. ఇక్కడ పండిస్తున్న నాణ్యమైన కూరగాయలు, పండ్లకు దేశీయ, విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
ప్రస్తుతం ఇక్కడ సాగు చేస్తున్న క్యాప్సికం, కీరా పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూలను సాగు చేయడం తీరు బాగుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదన్నారు. పాలీహౌస్లో చేపట్టిన హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫాలీహౌస్నిర్వాహకులకు సూచించారు. మంత్రి వెంట సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజర్షిషా, జిల్లా వ్యవసాయ అధికారి నర్సింగ్రావు, జిల్లా ఉద్యానవన అధికారి సునీత, సిబ్బంది ఉన్నారు.