జహీరాబాద్, జూన్ 21: వ్యవసాయంలో కొత్త పద్ధతులతో పంటలు సాగు చేసి, అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం కలిపిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణ సమీపంలో మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ ప్లాంట్ను పరిశీలించారు.
రంజోల్ రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో నూతన పరిజ్ఞానంపై రైతులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో నూతన మార్పులు తీసుకువచ్చేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని, వచ్చే ఏడాదిలోగా, కార్యరూపం చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో మార్పు తీసుకువచ్చేందుకు ఒక సెక్టారును తయారు చేసి పనులు చేసేందుకు కూలీలు, యంత్రాలతో గ్రూపు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన సేవలు అద్దెకు ఇచ్చేందుకు నిరుద్యోగులు.. ప్రభుత్వం నుంచి సబ్సిడీపై యంత్రాలు తీసుకొని కొనసాగించాలన్నారు. వ్యవసాయానికి మహీంద్రా ట్రాక్టర్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. యంత్రాలతో వ్యవసాయం చేసేందుకు ఎక్కువగా రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు.
ప్రపంచంలో మహీంద్రా ట్రాక్టర్లకు గుర్తింపు
ప్రపంచంలో మహీంద్రా ట్రాక్టర్కు ప్రత్యేక గుర్తింపు ఉంద ని, జహీరాబాద్లో ఉత్పత్తి చేస్తున్న మహీంద్రా ట్రాక్టర్లు 44 దేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. రైతులకు తక్కువ ఖర్చుతో పనిచేసే యంత్రాలను విక్రయించాలని, వ్యవసాయానికి అవసరమైన ట్రాక్టర్లను కంపెనీలు ఉత్పత్తి చేయాలన్నారు. పలువురు రైతులు మంత్రి తో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వాలని కోరారు. పంట సాగు పెట్టుబడి, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నదని, రైతు సంక్షేమానికి ఎల్లప్పుడు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కొత్త పరిజ్ఞానంతో పంటలు సాగు చేయాలి
వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటలు సాగు చేసేందుకు రైతులు నూతన పరిజ్ఞానం ఉపయోగించాలన్నారు. తెలంగాణలో ఎకరాకు వరి 30 క్వింటాలు ఉత్పత్తి చేస్తే, విదేశాల్లో వంద క్వింటాలు ఉత్పత్తి చేసి లాభాలు పొందుతున్నారన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపాలన్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తుందన్నారు. సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు.
పంట దిగుబడి పెంచి అధిక లాభాలు పొందాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, ఆర్డీవో రమేశ్బాబు, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రతినిధులు రాయ్, ప్రదీప్గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు నరసింహారావు, భిక్షపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎంజీ. రాములు, సయ్యద్ మోహినొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు తన్వీర్, కార్మిక సంఘం అధ్యక్షుడు రాంబాబు, రైతులు పాల్గొన్నారు.