2018 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ మల్కాపూర్ గ్రామాన్ని సందర్శించి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు గ్రామానికి వరాల జల్లు కురిపించారు. గ్రామానికి 140 డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం రూ. 6 కోట్లు, ప్రతి కుటుంబానికి గేదెలు, యువకులకు రూ. పది లక్షల వ్యయంతో జిమ్, రూ. 75 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం తదితర వరాలిచ్చారు.
తూప్రాన్, జూన్ 18 : మెదక్ జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం ‘మల్కాపూర్’ అనగానే మొదటగా వినిపించిన మాట మావోయిస్టుల కోటని.. తరుచూ గొడవలు, కేసులతో వెనకబడిన ప్రాంతమని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గ్రామమని, కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. యువత కృషితో, నాయకులు, అధికారుల ఆదరణతో తెలంగాణ రాష్ట్రంలో ఓఆదర్శ గ్రామంగా నిలిచింది. ఒకప్పుడు చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఆ గ్రామానికి వెళ్లడానికి అధికారులు, నాయకులు జంకేవారు. కానీ ఇప్పుడా ఊరు రూపు రేఖలు మారాయి. 1358 మంది జనాభా, 8 వార్డులు, 950 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామాన్ని అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ దత్తత తీసుకోవడంతో పాటు వర్గపోరును రూపుమాపి, యువత దృష్టిని గ్రామాభివృద్ధివైపు మరల్చేలా చేశారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ నింపిన స్ఫూర్తితో ఆ గ్రామ యువజన సంఘాల సభ్యులు గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు కదిలారు. గ్రామంలో ఉన్న పలు యువజన సంఘాలన్నీ ఏకమయ్యా యి. తొలుత ఏడు కమిటీలుగా ఏర్పాటు చేసుకుని, గ్రామానికి మౌలిక వసతులు కల్పించుకోవడంపై దృష్టిసారించాయి. గ్రామాన్ని ఆరు బ్లాకులుగా విభజించి, వారానికో బ్లాక్ చొప్పున స్వచ్ఛ భారత్ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. దీంతో మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మారుమూల గ్రామమైన మల్కాపూర్ ప్రగతి దిశగా పయనించి, తెలంగాణలోనే ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నది. తెలంగాణాతో పాటు దేశ విదేశాలకు చెందిన పలువురు పర్యాటకులు, స్వచ్ఛంద సంస్థలు ఓ కేస్ స్టడీలా మల్కాపూర్ను సందర్శించడం విశేషం. మారుమూల గ్రామమైన మల్కాపూర్ ఈ స్థాయికి చేరుకోవడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
‘గ్రామ జ్యోతి’తో మొదలైన ఉద్యమం
సీఎం కేసీఆర్ ప్రారంభించిన గ్రామజ్యోతి పథకమే.. మల్కాపూర్ విశేష ప్రగతికి అంకురార్పణ గావించిందని చెప్పవచ్చు. మల్కాపూర్ యువత ఉత్సాహాన్ని చూసిన అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రగతిని సమీక్షించడంతో పాటు నిధులు మంజూరయ్యేలా కృషి చేయడంతో పల్లె రూపురేఖలు మారిపోయాయి. ఇలా ప్రగతి పథంలో పయనిస్తున్న మల్కాపూర్ సీఎం కేసీఆర్ దృష్టిని సైతం ఆకర్శించింది. అందుకే 2018 ఆగస్టు 15న మొదలైన ‘కంటివెలుగు’ కార్యక్రమా న్ని ప్రారంభించేందుకు మల్కాపూర్ను వేదికగా ఎంచుకోని, ఇక్కడే ప్రారంభించడం విశేషం.
మలుపు తిప్పిన గ్రామజ్యోతి, కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రోత్సాహం
చుట్టూ గుట్టలు, అటవీ ప్రాంతం మధ్యలో అభివృద్ధికి ఆమడ దూరంలో మారుమూల పల్లెగా ఉన్న మల్కాపూర్ అభివృద్ధికి బీజం పడింది మాత్రం 25 ఆగస్టు, 2015న. అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మల్కాపూర్ను దత్తత తీసుకున్నారు. మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అప్పటి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చొరవ, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యం రెడ్డి పర్యవేక్షణలో ప్రగతి వీచికలు ప్రసరించాయి. యువతను సమీకరించడంతో పాటు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయిస్తూ వచ్చారు.
24 గంటల్లో మిషన్ భగీరథ నీళ్లు..
ముఖ్యంగా మల్కాపూర్ గ్రామస్తుల పట్టుదలకు నిదర్శనమని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో గ్రామస్తులు, యువకులు శ్రమించి, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడానికి తీసుకొచ్చిన పైపులైన్ను గ్రామ యువకులంతా 24 గంటల్లో ప్రతి ఇంటికీ చేరవేసి నల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తుల కృషిని చూసి అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మినీ పార్కులు..సోలార్ వెలుగులు
ప్రభుత్వ ప్రోత్సాహం, యువత భాగస్వామ్యం ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మల్కాపూర్లో రూ. 50లక్షల వ్యయంతో ప్రతీ బ్లాక్కు సీసీ రోడ్లను నిర్మించారు. రూ. 45 లక్షలతో పంచాయతీ భవనం, వంద శాతం మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, ప్రతీ ఇంటికి కనీసం 5 నుంచి 50 మొక్కలు నాటడంతో పాటు నాలుగు మినీపార్కులను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవడంతో అటు భూగర్భజల మట్టం పెరగడంతో పాటు, ఇటు దోమల బెడదా తీరింది.
ఎన్నో అవార్డులు మల్కాపూర్ సొంతం
తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ ఎన్నో అవార్డులను దక్కించుకున్నది. 2016 జూన్ 2న రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రూ. లక్షా నూటపదహారు నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందుకున్నారు అప్పటి సర్పంచ్. 2017 మార్చి 23న ఉత్తమ యువజన సంఘం అవార్డు, అదే ఏడాది జూన్ 2న ఉత్తమ జిల్లా స్థాయి పంచాయతీ అవార్డుతో పాటు రూ. 51,116ల నగదు, జ్ఞాపికను అందుకున్నారు. 2017 ఆగస్టు 15న జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ సమైఖ్య సంఘం అవార్డులు మల్కాపూర్ను వరించింది. 2016 జూన్లో నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాయించి, ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో మేకిన్ మల్కాపూర్ అసోసియేషన్ యూత్ సభ్యులు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇప్పటికే దాదాపు 305 వారాలుగా ప్రతివారం ఏదో బ్లాకులో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు.
ప్రత్యేక ఆకర్శణగా ‘రాక్ గార్డెన్’
ఎందుకూ పనికి రాని రాళ్లు రప్పలు నడుమ తుమ్మచెట్లు, చెత్తాచెదారం నిండి ఉన్న ప్రాంతాన్ని యువత శ్రమదానంతో పాటు ప్రభుత్వ సహకారంతో రూ. 6 లక్షలు వెచ్చిం చి ‘రాక్ గార్డెన్’ పేరిట సరికొత్త పార్కును నిర్మించారు. రాక్ గార్డెన్ ముఖ ద్వారంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఓ మొక్కను కూడా నాటారు.
ఒక్కటైన చైతన్యం
గ్రామ యువతను ఒక్కతాటిపైకి తేవడంలో అధికారులు కీలక భూమిక పోషించారు. అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తూ, వారిని గ్రామ ప్రగతిలో భాగస్వామ్యం చేశారు. ఐదు యువజన సంఘాలు ఒకే గొడుకు కిందకు వచ్చి ‘మేకిన్ మల్కాపూర్’గా ఏర్పడ్డారు. విద్యాభివృద్ధి, వ్యవసాయం, తాగునీటి, పారిశుధ్య, వైద్య, ఆరోగ్యం, పోషకాహార పర్యావరణ రక్షణ మౌలిక సదుపాయాల పేరుతో కమిటీల వారీగా అభివృద్ధిలో మమేకమయ్యారు.