హుస్నాబాద్, జూన్ 14: మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, సిద్దిపేట వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి, వారిని ఆర్థికంగా, మానసికంగా ఇతర పార్టీల నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 95శాతం మంది నిర్వాసితులకు పరిహారం అందిందని, మిగతా కొద్ది మంది మాత్రమే ప్రతిపక్ష పార్టీల మాటలు విని కోర్టుకెళ్లడం.. అవసరం లేని ఉద్యమాలకు పాల్పడటం చేస్తున్నారన్నారు. గౌరవెల్లి పూర్తయితే హుస్నాబాద్ నియోజకవర్గంలోని 1.60లక్షల ఎకరాలకు సాగునీరంది, ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, ఇటువంటి ప్రాజెక్టును అడ్డుకొని కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు.
భూనిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక భవిష్యత్లో వారి ఉనికిని పూర్తిగా కోల్పోతారనే భయంతోనే కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు భూనిర్వాసితుల సమస్యను జఠిలం చేస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలు మానుకోకుంటే నియోజకవర్గంలోని రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మి, కొక్కుల కీర్తి, అనిత, జడ్పీటీసీలు భూక్యా మంగ, శ్యామల, వంగ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, నాయకులు వెంకట్రామ్రెడ్డి, ఎండీ అన్వర్, పెసరు సాంబరాజు, ఆవుల మహేందర్, తిరుపతిరెడ్డి, బీలూనాయక్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయం నుంచి రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్ మహేశ్కుమార్కు ప్రాజెక్టు పనులు కొనసాగించాలని వినతిపత్రం సమర్పించారు.