సంగారెడ్డి కలెక్టరేట్, మే 28: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, సిబ్బంది, ఫార్మసీ రిజిస్టర్లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని అన్ని గదుల్లో తిరిగి, పరిశీలించి ఆయా గదులు దేనికి వినియోగిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఓపీలో ఉన్న మహిళలతో మాట్లాడి పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఆరోగ్య కేంద్రం పరిశుభ్రత బాగున్నదని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే బాధితులకు బాధ్యతగా వైద్య సేవలు అందించి, రోగులకు భరోసా కల్పించాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఓపీ సేవలను మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. గ్రామాల్లో ఆశలు, ఏఎన్ఎంలు, గర్భిణులకు కేసీఆర్ కిట్ తదితర అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్సీలో అందుబాటులో ఉన్న పరీక్షలు చేయాలని, శాంపిల్స్ సేకరించి టీ డయాగ్నాస్టిక్ హబ్కు పంపాలని ఆదేశించారు. ఈ తనిఖీలో పీహెచ్సీ డాక్టర్ నవీన్ కుమార్, ఫార్మసిస్ట్లు, స్టాఫ్ నర్సులు తదితరులు ఉన్నారు.