నర్సాపూర్, మే 28 : పెరుగుతున్న రసాయన ఎరువులు, కూలీల ఖర్చులతో వ్యవసాయ రంగం కుదేలవుతున్న తరుణంలో వ్యవసా యం దండగ కాదు పండుగ అంటున్నాడు ఓ యువకుడు. తాను అందరిలాగా కాకుండా తన పద్ధతిలో పంటలను సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వెదజల్లే పద్ధతిలో సేంద్రియ ఎరువులను వాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నాడు మహేశ్గౌడ్.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన మహేశ్గౌడ్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. వాళ్లది వ్యవసాయ కుటుంబం కావడంతో తన తండ్రి అంజాగౌడ్ వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాడు. వ్యవసాయంలో పెట్టుబడు లు ఎక్కువ కావడంతో దానిని అధికమించలేక 10సంవత్సరాల క్రితం వ్యవసాయాన్ని మానేసి ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చి ఇతర పనులు చేసుకొని జీవనం సాగించాడు. ఇది గ్రహించిన మహేశ్గౌడ్ నూతన పద్ధతి లో వ్యవసాయం చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించాలని సంకల్పించాడు. తనకున్న ఐదు ఎకరాల్లో వరిపంట వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వరి సాగులో తక్కువ పెట్టుబడి వెచ్చించి, కూలీల ఖర్చులను తగ్గించి అధిక దిగుబడిని సాధించాలని వెదజల్లే పద్ధతిని ఎంచుకున్నాడు.
సాగు విధానం
సేంద్రియ ఎరువులతో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులను తగ్గించ్చుకోవచ్చని మహేశ్గౌడ్ భావించాడు. ముందస్తుగా వరిసాగు చేసే పొలంలో భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులైన జీలుగను వేసి దుక్కిదున్నాడు. ఆ తర్వాత పీఎస్పీ(ఆవు వ్యర్ధాలతో తయారు చేసిన) మందును వర్మీ కంపోస్టులో కలిపి పొలంలో చల్లాడు. నెల రోజుల పాటు నీళ్లను వేసుకుంటూ తీయడం జరిగింది. అనంతరం క్రిమిసంహారక మందులకు బదులు నీమ్ ఆయిల్ను పిచికారీ చేసి బురద పొలాన్ని ఎత్తు వంపులు లేకుండా చదును చేస్తారు. ఆ తర్వాత వరి విత్తనాలను పొలంలో వెదజల్లుతారు. ఇలా వరి పంటను సాగుచేస్తే దొడ్డు రకం 125రోజులు సన్నరకం 135 రోజులకు పంట చేతికి వస్తున్నది. ఈ విధంగా సాగు చేస్తే పెట్టుబడి 10 వేలు అవుతుంది. అదే రసాయనిక ఎరువుల వాడితే ఎకరానికి 25 నుంచి 30వేల వరకు పెట్టుబడి అవుతున్నది. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని మహేశ్గౌడ్ తెలిపారు.
కూలీల ఖర్చులు కూడా తక్కువే..
సేంద్రియ ఎరువులతో వెదజల్లే పద్ధతి ద్వారా వరిసాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. నేను సేంద్రియ పద్ధతిలో వరిసాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందాను. ప్రతి రైతు ఈ విధంగా వరిసాగు చేస్తే ఖర్చులను అధిగమించి మంచి లాభాలను పొం దవచ్చు. సేంద్రియ పద్ధతిలో వరిసాగు చేస్తే ఆరోగ్యకరమైన పంట ను ప్రజలకు అందించవచ్చు. అలాగే భూసారం పెరిగి రైతులకు అధిక దిగుబడి వస్తది. ఇతర రైతులు ఈ విధంగా సాగు చేయాలనుకుంటే వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
– మహేశ్గౌడ్