మెదక్రూరల్, మే25: ఎవరికైనా ఆఖరి మజిలీ సాఫీగా సాగాలని తెలంగాణ ప్రభుత్వం వైకుంఠధామాలు నిర్మించింది. సకల సౌకర్యాలతో ఊరూరా శ్మశాన వాటికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతంలో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలం లేక వారి బంధువులు ఇబ్బందులు పడేవారు. రోడ్డువెంట, చెరువు భూముల్లో అంత్యక్రియలు పూర్తి చేసేవారు. ఆ ప్రాంతంలో సదుపాయాలు లేక ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. సకల సౌకర్యాలతో వైకుంఠధామాలు నిర్మితమవుతున్నాయి. దీంతో అన్ని ఇబ్బందులు తొలిగాయి.
అభివృద్ధిలో ఆదర్శం పాతూరు
పల్లెప్రగతిలో భాగంగా మెదక్ మండలంలోని పాతూర్ పంచాయతీ మండలంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 2601 మంది జనాభా, 500 నివాస గృహాలు ఉన్నాయి. పంచాయతీ రూ.12.60 లక్షల వ్యయంతో 20 గుంటల స్థలంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. ఇందులో పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా స్నానాల గదులు, మరుగుదొడ్లు, నీటి వసతికి ప్రత్యేకంగా ట్యాంక్ నిర్మించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రెండు ప్లాట్ ఫామ్లు ఏర్పాటు చేశారు. విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఆ పల్లెల్లో రోజు వారీ పనులు నిరాటంకంగా సాగుతుండటంతో పాతూరు కొత్త రూపును సంతరించుకున్నది. గ్రామప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డ్మెంబర్లు ప్రణాళికలు తయారు చేసుకుని పాతూరును మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చదిద్దడానికి కృషి చేశారు. దీంతో జిల్లాలో ఉత్తమ సర్పంచ్ అవార్డ్ను సర్పంచ్ లింగమ్మకు కలెక్టర్ అందజేశారు.
ఇబ్బందులు తొలిగిపోయాయి
గతంలో మా గ్రామంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడేవా రు. జాగ లేక నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో కూడిన వైకుంఠధామాన్ని మా గ్రామంలో నిర్మించింది. దీంతో ఇబ్బందులు తొలిగిపోయాయి.
– బాలయ్య, గ్రామస్తుడు, పాతురు
సకల హంగులతో నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వ కృషితో వైకుంఠధామాన్ని సకల హంగులతో నిర్మించాం. అంతిమ సంస్కారాలకు వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మహిళలు, పురుషులకు ప్రత్యేక స్నానాల గదులు నిర్మించాం. విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తు న్నాం. ఉత్తమ సర్పంచ్ అవార్డ్ వరించింది.
– లింగమ్మ, సర్పంచ్, పాతూరు
వైకుంఠధామంలో అన్ని సౌకర్యాలు
గ్రామ సర్పంచ్ల సహకారంతో నిర్మాణాలను సకాలంలో పూర్తిచేశాం. ప్రతి దాంట్లో స్నానాల గదులు, నీటి ట్యాంక్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తొలిగాయి. ప్రహరీ చుట్టూ మొక్కలు నాటించాం. మండలంలోని అన్ని పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణలు పూర్తిచేశాం.
– సల్మాన్, పంచాయతీరాజ్ ఏఈ, మెదక్ మండలం