రాయపోల్ మే 25 : సాధారణంగా ఆర్మీలోకి పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ, తమ ఇద్దరు కొడుకులనూ సైన్యంలోకి పంపించి ఆదర్శంగా నిలిచారు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ గ్రామానికి చెందిన పడిగె నర్సింలు-జనమ్మ దంపతులు. వ్యవసాయ కుటుంబమైనా, ఇద్దరు కొడుకులు ఆంజనేయులు, నందీశ్వర్గౌడ్ను దేశ సేవకు పంపారు.
నర్సింలుది వ్యవసాయ కుటుంబం. జనమ్మ సోదరుడు నీల చంద్రం 15ఏండ్ల క్రితం ఆర్మీలో సేవలందించాడు. తన మేనమామను స్ఫూర్తిగా తీసుకున్న ఆంజనేయులు, నందీశ్వర్లు తాము కుడా ఆర్మీలో చేరి, దేశ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. వారి తల్లిదండ్రులకు విషయం చెప్పగా, ఆ దపంతులు అడ్డు చెప్పలేదు.
అన్నదమ్ములు వారి మేనమామ ప్రోత్సాహంతో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్లో కోచింగ్ తీసుకున్నారు. సోదరులిద్దరూ 2018లో ఆర్మీకి సెలక్టయ్యారు. ఆంజనేయులు ప్రస్తుతం జమ్ముకశ్మీర్లోని అక్నూర్ సెక్టార్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. నందీశ్వర్ ఢిల్లీలో పని చేస్తున్నాడు. పేద కుటుంబంలో జన్మించిన అన్నదములు కష్టపడి చదువుకొని, వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. చిన్న వయసు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసి, మేనమామ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న వారు, ఆర్మీకి ఎంపిక అయ్యారు. ఒకే గ్రామం, అన్నదమ్ములు దేశ సేవ చేస్తూ ఆదర్శంగా నిలిచారు. కష్టపడి చదువుకుంటే ప్రతి విద్యార్థి, యువకులు ఏదైనా సాధించవచ్చని మంతూర్ గ్రామానికి చెందిన అన్నదములు ఆంజనేయులు, నందీశర్ నిరూపించారు.