రెండేండ్లుగా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతు యాదగిరి
నిజాంపేట, మే 25 : ఆరుగాలం కష్టపడుతున్నా.. పంటలను పండించే విధానం, ఏ సమయంలో ఏ పంట వేస్తే నష్టాలు లేకుండా అధికంగా ఆదాయం వస్తుందో పూర్తి స్థాయిలో అవగాహన లేక ఏదో ఒక పంటను సాగు చేస్తున్నారు కొంత మంది రైతులు. ఫలితంగా పెట్టుబడి అధికమై, దిగుబడి పూర్తిస్థాయిలో రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏ కాలంలోనైనా పండే పంటలను గుర్తించి వాటిని సాగు చేస్తూ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు, ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నాడు మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన రైతు యాదగిరి. గత రెండేండ్లుగా రెండు ఎకరాల పొలంలో బెండకాయతో పాటు సొర, బీర వంటి కూరగాయలను సాగుచేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. బెండకాయ పంటకు ఏదైనా తెగుళ్లు సోకితే వ్యవసాయ అధికారుల సూచనలతో పురుగు మందులను వాడుతూ పంటను రక్షించుకుంటున్నాడు.
బెండతో అధిక ఆదాయం
ఒక ఎకరం పొలంలో బెండ పంటను సాగు చేయాలంటే దున్నకానికి రూ.5 వేలు, విత్తనాలకు రూ.5 వేలు, కూలీలకు రూ.12 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ.8 వేలు దాదాపుగా రూ.30 వేల ఖర్చు రాగా, విత్తిన 55 రోజులకు దిగుబడి మొదలై 130 రోజుల వరకు వస్తూనే ఉంటుంది. ఒక్క రోజుకు ఒక్క ఎకరం పొలంలో 1.50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకాయకు రూ.20 వరకు ధర పలుకుగా రూ.లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు. బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. ఇందులో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక రైతులు ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. సరైన సమయాల్లో పోషకాలు అందిస్తూ బెండను సాగు చేయడంతో స్థిరమైన ఆదాయం వస్తున్నది.
దుబాయి నుంచి తిరిగి వచ్చి..
బతుకుదెరువు కోసం యాదగిరి అప్పులు చేసి కుటుంబాన్ని విడిచి దుబాయికి వలస వెళ్లాడు.దాదాపు మూడేండ్ల పాటు ఉన్న అప్పులు తీరలేదు. పంటలను సాగు చేయడానికి సరిపడా నీళ్లు, పండించిన పంటకు సరైన మద్దతు ధర లభిస్తుండడంతో సొంతూర్లోనే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. తన వ్యవసాయ పొలంలో బోరుబావి తవ్వించగా సమృద్ధిగా నీళ్లు పండటంతో కూరగాయల పంటలను సాగు చేయడం ప్రారంభించాడు.
కష్టజీవి యాదగిరి
మొదటి నుంచి రైతు యాదగిరిది కష్టపడే తత్వమే. ప్రతి పనిని సొంతంగా చేసుకుంటాడు. అత్యవసరమైతేనే కూలీల సాయం తీసుకుంటాడు. సీజన్కు ముందే తన వ్యవసాయ భూమిలో ఏ రకం కూరగాయ పంటను సాగు చేయాలో నిర్ణయించుకొని, ఆ తర్వాతే పంటలను పండిస్తాడు. ఒక్కోసారి అనుకున్నంత లాభం రాకపోయినా ఏ మాత్రం బాధపడకుంగా వచ్చే సారి ఆదాయం పెరిగేందుకు ఏ పంటను వేయాలో, ఎప్పడికప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. మన్నికగా (నాణ్యమైన) బెండ విత్తనాలను ఎంపిక చేసుకొని పొలంలో విత్తుకొని సరైన సమయంలో ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటిస్తూ బెండ, ఇతర పంటలను సాగు చేస్తాడు. మార్కెట్లో ఏ కూరగాయ పంటకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందో ముందుగానే తెలుసుకొని ఆ కూరగాయలను వేస్తాడు. వాతావరణాన్ని బట్టి బెండ, సొర, బీర పంటలకు అవసరమున్నప్పుడు నీళ్లను అందిస్తాడు.
సాగు చేయడమే కాదు.. మార్కెట్లో అమ్మాలి..
రెండేండ్ల నుంచి నా పొలంలో బెండకాయ సాగుచేస్తున్న. రోజంతా కలుపు మొక్కలను తొలగిస్తూ ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగు మందులను పంటకు వాడతా. మార్కెట్లో బెండకాయలకు ధర ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పంటను సాగుచేస్తా. నిజాంపేటతో పాటు భూంపల్లి, కల్వకుంట, చల్మెడ, నందిగామ, పోతారెడ్డిపేట,నగరం, నందగోకుల్ గ్రామాల్లో జరిగే వారంతపు సంతలో బెండకాయలను విక్రయిస్తా. ఈ సారి బెండకాయలు బాగా కాసినయి. రెట్టింపు ఆదాయం వస్తుందని అనుకుంటున్నా.
– యాదగిరి, రైతు , నిజాంపేట, మెదక్ జిల్లా