వరంగల్, మే 24 : పట్టుదలతో కష్టపడి చదివితే సర్కారు కొలువు సులువుగా సాధించవచ్చని వక్తలు ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేశారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే పత్రికలు దాస్యం రంగశీల ఫౌండేషన్ సౌజన్యంతో మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంతో నిర్వహించిన నిపుణ ‘కొలువు-గెలువు’ పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. వివిధ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈ సదస్సులో వక్తలు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి?, ఎలా చదవాలి, ఏం చదవాలనే విషయాలపై వివరించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు మెళకువలను వివరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి సదస్సు వచ్చిన ఉద్యోగార్థుల్లో స్ఫూర్తినింపారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ సీఎస్ వేప పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. పోటీ పరీక్షల్లో పట్టు సాధించేందుకు మెళకువలు వివరించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్కుమార్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, దాస్యం రంగశీల ఫౌండేషన్ కోఆర్డినేటర్ దాస్యం విజయ్భాస్కర్, బాధ్యుడు ప్రణయ్, సర్క్యులేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్రెడ్డి, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ అప్పని సూరి, డెస్క్ ఇన్చార్జి కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
నాడు ఉద్యమ పత్రిక.. నేడు ఉద్యోగ పత్రిక
ఉద్యమ పత్రిక నమస్తే తెలంగాణ.. నేడు రాష్ట్రంలో కొలువుల జాతర నడుస్తున్న వేళ ఉద్యోగ పత్రికగా మారింది. నోటిఫికేషన్ల రాకతో యువతలో ఉద్యోగాల జోష్ కనిపిస్తోంది. స్థానికులకే ఉద్యోగాలు రావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. 95 శాతం లోకల్ వాళ్లకే కొలువులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 80వేల ఉద్యోగాలు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి. నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టి లక్ష్యం వైపు అడుగులు వేయాలి.
– దాస్యం వినయ్భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్
ఎవరూ దోచుకోలేని సంపద విద్య
ఎవరూ దోచుకోలేని సంపద విద్య ఒక్కటే. ఎంత కష్టపడితే అంత విజ్ఞానం వస్తుంది. రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కనున్నాయి. లక్ష్యం కొండంత ఉన్నా కష్టపడితే సులువుగా విజయం సాధించవచ్చు. ఈ మేరకు విద్యార్థులు సిద్ధం కావాలి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థుల కోసం నమస్తే తెలంగాణ నిపుణ పేరుతో ప్రత్యేక సంచిక అందిస్తున్నది. ప్రతి రోజూ నాలుగు పేజీలు, బుధవారం రోజు ఎనిమిది పేజీలతో వచ్చే సంచికలో సమగ్ర సమాచారం ఉంటుంది. ఉద్యోగార్థులకు ఈ సంచిక ఎంతో ఉపయోగపడుతుంది.
– తిగుళ్ల కృష్ణమూర్తి, ఎడిటర్, నమస్తే తెలంగాణ
నిబద్ధతతోచదవాలి
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నిబద్ధతతో చదవాలి. భయం వదిలి, సందేహాలను నివృత్తి చేసుకుంటూ నిరుత్సాహ పడకుండా కష్టపడి చదివితే సులభంగా విజయం సాధించవచ్చు. చదువుతోపాటు రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ప్రశ్నకు సరిగా జవాబు రాసే లా అవగాహన కలిగి ఉండాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఎన్ని పుస్తకాలు చదివామన్నది ముఖ్యం కాదు. ఎంత నిబద్ధతతో చదివామన్నదే ముఖ్యం. పోటీ పరీక్షల్లో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని వృథా చేయకుండా చదవాలి.
– రాజీవ్గాంధీ హన్మంతు, హనుమకొండ కలెక్టర్
టైం టేబుల్ మస్ట్
ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివితే సక్సెస్ మీదే. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ప్రణాళికాబద్ధంగా చదవాలి. పోటీ పడుతున్న ఉద్యోగానికి తగ్గట్టుగా సబ్జెక్టులు, సిలబస్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రణాళికాబద్ధంగా, నిబద్ధతతో చదివితే విజయం సాధించవ చ్చు. సమయం ఎంతో విలువైంది. అందుకోసం రోజువారీగా టైం టెబుల్ పెట్టుకోవాలి. దానిని కచ్చితంగా అమలుచేయాలి. అప్పుడే మనం ఎంత సమయం వృథా చేస్తున్నామో తెలుస్తుంది. తద్వారా మన బలహీనతలను అధిగమించి సునాయాసంగా విజయం సాధించవచ్చు. యువత నిరుత్సాహ పడకుండా ముందుకు వెళ్లాలి. సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టిపెట్టాలి.
– తరుణ్ జోషి, వరంగల్ పోలీస్ కమిషనర్
నిపుణ.. పోటీ పరీక్షలకు దిక్సూచి
పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురిస్తున్న నిపుణ దిక్సూచిలా నిలుస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులు కరెంట్ అఫైర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏడాది కాలం నుంచి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలకు సంబంధించినవి చదవాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో కష్టపడి చదివితే సక్సెస్ సాధించవచ్చు. అలాగే గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించాంలి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఆయిల్ ఫామింగ్, ఫార్మసీ రంగాల్లో స్పెషల్ ఫోకల్ పెట్టాలి.
– బాలలత మల్లవరపు, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
‘నమస్తే’ సదస్సు అభినందనీయం
యువత సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలి. ఒకేసారి 80వేల ఉద్యోగాలు భర్తీ కానున్న తరుణంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల కోసం నమస్తే తెలంగాణ అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయం. నమస్తే తెలంగాణ పత్రిక అందిస్తున్న నిపుణ సంచిక పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుంది.
– సీఎస్ వేప, వేప అకాడమీ డైరెక్టర్
జాబ్ సాధిస్తాననే ధీమా వచ్చింది..
నమస్తే తెలంగాణ నిరుద్యోగుల కోసం ఎంతగానో ఆరాటపడుతున్నది. పోటీ పరీక్షలకు నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే చాలామందిలో తెలియని భయం ఉంటుంది. ఎలా ప్రిపేరవ్వాలి.. ఎలా ముందుకెళ్లాలని తర్జనభర్జన పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఉద్యోగార్థుల కోసం నమస్తే తెలంగాణ ఎన్నో వ్యయప్రయాసల కోర్చి మాలాంటి వాళ్ల కోసం సదస్సు పెట్టడం సంతోషంగా ఉంది. సదస్సులో వక్తల ప్రసంగాలు విన్నాక నాకైతే క్లారిటీ వచ్చింది. ఎన్నో సందేహాలు, ప్రశ్నలకు సమాధానం దొరికింది. పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి సార్ ప్రణాళికాబద్ధంగా ఎలా చదవాలో సూచించిన తీరు అద్భుతం. పక్కా ప్రణాళికతో చదివి గ్రూప్-4లో ఉద్యోగం సాధిస్త.
-నాగలక్ష్మి, ములుగు రోడ్డు
స్ఫూర్తినిచ్చేలా ప్రసంగాలు
అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటే సాధించలేనిదేదీ లేదని ఈ సదస్సులో వక్తల ప్రసంగాల ద్వారా తెలుసుకున్న. వారి స్పీచ్లు స్ఫూర్తిని కలిగించాయి. ఎలాగైనా జాబ్ కొట్టాలనే కసిని పెంచాయి. పోలీస్, గ్రూప్స్ కొలువులకు ఎలా ప్రిపేరవ్వాలి.. ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి.. ప్లానింగ్ ఎలా ఉండాలనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. వీటితోపాటు ప్రతి రోజూ నిపుణలో సబ్జెక్టుల వారీగా ఇచ్చే పాఠాలు బాగున్నాయి. మాది మహబూబాబాద్ జిల్లా. జాబ్స్ నోటిఫికేషన్స్ రావడంతో ఇక్కడే ఉండి ప్రిపేరవుతున్న. మీరిచ్చిన స్ఫూర్తితో కొలువు కొట్టడమే లక్ష్యంగా కష్టపడి చదువుతా. ఇంతమంచి ప్రోగ్రాం పెట్టిన ‘నమస్తే తెలంగాణ’కు రుణపడి ఉంటా.
-సాయి ప్రసన్న, మహబూబాబాద్
‘నిపుణ’ ఫాలో అవుతున్నా..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఉద్యోగార్థుల పత్రికగా మారడం సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా నిపుణలో జీకే, కరంట్ అఫైర్స్, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు చాలా విపులంగా ఇస్తున్నారు. ప్రతి రోజూ ఫాలో అవుతున్నా. నా లక్ష్యం గ్రూప్స్. నా భర్త సహకారంతో ప్రిపేరవుతున్న. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంది. కొలువు-గెలువు పేరుతో నమస్తే తెలంగాణ నిర్వహించిన సదస్సు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వక్తలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సలహాలు, సూచనలు పాటిస్త. వారిచ్చిన స్ఫూర్తితో కష్టపడి చదివి జాబ్ సంపాదిస్త.
– జీ లావణ్య, హనుమకొండ
బాలలత మేడమ్ మంచి గైడెన్స్ ఇచ్చారు..
మీరిచ్చిన స్ఫూర్తితో ముందుకుపోతాం మేడం.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే నిర్వహించిన సదస్సుకు రావడం సంతోషాన్నిచ్చింది. తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్న. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగం కొట్టాలన్నా అంత సులువు కాదు. సుదీర్ఘ ప్రణాళిక అవసరం. ఈ సదస్సు ద్వారా నాకు చాలా అంశాలపై స్పష్టత వచ్చింది. ముఖ్యంగా బాలలత మేడమ్ లెక్చర్ సూపర్. కరంట్ అఫైర్స్, పారిశ్రామిక విధానాలు, తెలంగాణ కోసం వేసిన కమిటీలు, జనరల్ స్టడీస్కు సంబంధించిన అంశాలపై ఇచ్చిన లెక్చర్, ప్లానింగ్ ఎలా ఉండాలి.., ఏయే పుస్తకాలు చదవాలనే అంశాలపై ఇచ్చిన క్లారిటీ చాలా బాగుంది.
– స్రవంతి, దివ్యాంగురాలు