మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ) : కోనాపూర్ సొ సైటీలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు పూ ర్తిగా అవాస్తవమని, రాజకీయ లబ్ధి కోసం తమ పార్టీకి చెందిన కొందరు నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఉద్దేశ పూర్వకంగా తనపై, పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని కోనాపూర్ సొసైటీ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని బద్నామ్ చేయడానికే కొందరు అధికార టీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రతిపక్షాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మెదక్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. 2007-2008 సంవత్సరం నుంచి కోనాపూర్ సొసైటీ చైర్మన్గా పనిచేస్తూ వివిధ కార్యకలాపాలు చేస్తున్నానన్నారు. సొసైటీలో 400 మంది వరకు రైతులు స భ్యులుగా ఉన్నారని, వారికి సుమారు రూ.30 లక్షల ఎస్ఏవో లోన్లు ఉన్నాయన్నారు. కోనాపూర్ సొసైటీ మూడు పాత రూమ్లతో ఉండేదని, సొసైటీకి సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా గతంలో సరిగ్గా మెయింటనెన్స్ చేయలేదన్నారు. తాను సొసైటీని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా మార్చాలనే లక్ష్యంతో శ్రమించి అభివృద్ధి చేశానన్నారు.
సొసైటీలో రూ.32 లక్షలతో 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మించామని, రూ.30 లక్షలతో, ఇఫ్కో సహకారంతో ఆరు దుకాణాలు కలిగిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినట్లు తెలిపారు. సుమారు రూ.63 లక్షల నిధులతో పెట్రోల్ పంపు నిర్మాణం చేసి, దానికి ప్రహరీ నిర్మించామని గుర్తుచేశారు. రూ.54 లక్షలతో 10 దుకాణాలు కలిగిన షాపింగ్ కాంప్లెక్స్ కమ్ కన్సూమర్ స్టోర్ను నిర్మించామన్నారు. సొసైటీలో సంఘం సభ్యులను పెంచుకోవాలనే దృక్పథంతో సుమారు 650 మందిని చేర్పించామన్నారు. వీరందరికీ ఎస్ఏవో లోన్లు కాకుండా అవసరమైన సభ్యులకు (ఎల్టీ) లాంగ్టర్మ్ లోన్లు ఇచ్చామన్నా రు. బైక్లు, ట్రాక్టర్లు, పైపులైన్లు, హార్వేస్టర్లు, పంపుసెట్లు, పందిరి వ్యవసాయానికి అసరమైన అన్ని రకాల లోన్లు ఇచ్చినట్లు దేవేందర్రెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా లో 105సొసైటీలు ఉండగా, అందులో కోనాపూర్ సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దామని, పలుమార్లు బెస్ట్ సొసైటీ అవార్డులు సైతం వచ్చినట్లు తెలిపారు.
మరణించిన సం ఘం సభ్యులకు రూ.3000 చెల్లించామని, 2014 నుంచి 2020 వరకు రెగ్యులర్గా చెల్లించి చనిపోయిన సభ్యుడికి రూ.5000 ఇచ్చినట్లు తెలిపారు. సంఘం సభ్యుల్లోని కు టుంబాల్లో 18 ఏండ్లు నిండిన ఆడపిల్లల పెండ్లికి సహా యం చేయాలని నిర్ణయించి, ఆడపిల్ల పెండ్లికి రూ.5వేలు, 2014 నుంచి 2020 వరకు రెగ్యులర్గా చెల్లించిన వారికి ఆడపిల్ల వివాహానికి రూ.6వేలు ఇచ్చామన్నారు. 2007-08లో ‘సీ’ గ్రేడ్ ఉన్న సొసైటీని 2009-10 వరకు ఏ-గ్రేడ్కు తీసుకొచ్చామన్నారు. 2020 వరకు ఏ-గ్రేడ్గానే కొ నసాగించామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్సీడీసీ ద్వారా లోన్ తీసుకున్న ఏకైక సొసైటీ కోనాపూర్ మాత్రమేనన్నారు. 2020 నాటికి సంఘం డిపాజిట్లు మొత్తం రూ.95 లక్షలు ఉన్నాయని, అందులో ఎస్బీఐ ఏడీబీలో రూ.82 లక్షలు, ఇఫ్కోలో రూ.3 లక్షలు, హెచ్పీసీఎల్లో రూ.5 లక్షలు, కోరమాండల్లో రూ.5 లక్షలు డిపాజిట్లు ఉన్నాయని దేవేందర్రెడ్డి తెలిపారు.
అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే
కోనాపూర్ సొసైటీలో రూ.2.26 కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సొసైటీ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య పద్మాదేవేందర్రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాల నాయకులు కోనాపూర్ సొసైటీలో జరిగిన అవినీతిని నిరూపించాలని డిమాండ్ చేశారు. రూపాయి అవినీతి జరిగినట్లు తేలితే రూ.10 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. జిల్లా సహకార అధికారి సరిగ్గా విచారణ చేయలేదన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ, తమ వాదనలు ఆయన పూర్తిగా వినలేదని దేవేందర్రెడ్డి అన్నారు. కోనాపూర్ సొసైటీలో తప్పులు జరిగాయని అంటున్నారు. కానీ, ఎలా జరిగిందనేది నిరూపించలేదన్నారు. సమావేశంలో కోనాపూర్ సొసైటీ మాజీ డైరెక్టర్లు కిషన్, సామేల్, రవీందర్రెడ్డి, బాబు, బాల్రెడ్డి, గన్యా తదదితరులు పాల్గొన్నారు.