మెదక్, మే 21 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజం ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటుందని, అనేక ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అనితర బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. సిబ్బంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజా సేవలో ముందుండాలన్నారు. సాయుధ దళ విభాగం విధులు వీఐపీ సెక్యూరిటీ, ట్రెజరీ సెక్యూరిటీ, ఖైదీలకు ఎస్కార్ట్లను అందించడం, కవాతుల్లో, గార్డ్ ఆఫ్ హానర్లో పాల్గొనడం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల అత్యవసర సందర్భంలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం లాంటి విధుల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్కాడ్ల పనితీరు, టియర్ గ్యాస్ షెల్స్ వినియోగం, పోలీసు బందోబస్తు మొదలైన అత్యవసర విధులను గురించి అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐ సురప నాయుడు, ఆర్ఐ నాగేశ్వర్రావు, ఏఆర్ ఎస్సైలు నరేశ్, భవానీకుమార్, మహిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ
మే 21, 1991న భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ తమిళనాడులో ప్రచారం చేస్తుండగా హత్యకు గురైన తర్వాత తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిధిలోని అన్నీ పోలీసు కార్యాలయాలు, పోలీస్స్టేషన్లలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీవ్గాంధీ ఆత్మాహుతి దాడికి బలయ్యారని, దీని ఫలితంగా దాదాపు 14 మంది మరణించారని అన్నారు. ఈ ఘటన తర్వాత రాజీవ్గాంధీ మరణించిన రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నామన్నారు. ఉగ్రవాదం మానవాళికి అత్యంత ప్రమాదకరమని, ప్రజలు సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, ఐక్యతను కలిగి ఉండడానికి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవ ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు.
శాంతిభద్రతల సమస్యలను ఆర్ఎఎఫ్తో అదుపు
శాంతి భద్రతలు, మతపరమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకుని అదుపు చేస్తుందని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బలగాలకు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కవాతు నిర్వహించినట్లు తెలిపారు. అంతకుముందు పట్టణ సీఐ మధు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కమాండర్ అవినాశ్, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ యాదయ్య, పట్టణ ఎస్సైలు రాజశేఖర్, మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్, ఫతేనగర్, చమన్, పిట్లంబెస్, మార్కెట్, జేఎన్రోడ్, ఆటోనగర్, పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.