మెదక్ మున్సిపాలిటీ/సంగారెడ్డి కలెక్టరేట్, మే 21: రేపటి నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి 3.15 గంటల సమయం కేటాయించారు. అందులో తొలుత 15 నిమిషాలు విద్యార్థులు ప్రశ్నా పత్రాన్ని చదువుకునేందుకు ఇచ్చారు. విద్యార్థులు పరీక్షా సమయానికి 45 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రా ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. విద్యార్థులు www.bseteleangana. bov.in నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లను అనుమతించాలని సూచించారు.
మెదక్ జిల్లాలో..
మెదక్జిల్లా వ్యాప్తంగా 72 పరీక్షా కేంద్రాలో ప్రభుత్వ పాఠశాలలు 58, ప్రైవేటు పాఠశాలు 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 11,400 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 11,395 మంది రెగ్యులర్, ఐదుగురు ప్రైవేటు విద్యార్థులున్నారు. 72 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 72 మంది డిపార్టుమెంట్ అధికారులు, 642 మం ది ఇన్విజిలేటర్లను నియమించారు. మూడు ప్లయింగ్ స్కాడ్, 17 సిట్టింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల్లో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు.
సంగారెడ్డి జిల్లాలో…
జిల్లాలో 117 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 22,564 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 22,553 మంది రెగ్యులర్, 11 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. కేంద్రాలను పర్యవేక్షించేందుకు 5 ప్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటుచేశారు. 117 సూపరింటెండెంట్లు, 117 డిపార్ట్మెంట ల్ అధికారులను నియమించారు. కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం సమయానికి అన్ని రూట్లలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.
ఈసారి 6 పేపర్లే..
ఈ విద్యా సంవత్సరంలో జరిగే ప్రశ్నాపత్రం సైతం మారనున్నది. 11 పేపర్లకు బదులు ఈసారి 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం 70 శాతం సిలబస్తోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి ‘సెంటర్ లోకేషన్’ యాప్ను రూపొందించారు.
సివిల్ డ్రెస్లో రావాలి..
విద్యార్థులు స్కూల్ యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్లో పరీక్షలకు హాజరుకావాలని అధికారులు పేర్కొంటున్నారు. యూనిఫాంలో ఉంటే ఫలానా పాఠశాల అని గుర్తించే అవకాశం ఉంటుందని, దీంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున సివిల్ డ్రెస్లో రావాలని సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. సమీపంలోని జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు మూసివేయనున్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు చేరాయి. ఏ రోజుకారోజు ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లనున్నారు.
ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు
విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లుచేశాం. తాగునీరు, వైద్య సదుపాయలు కల్పిస్తున్నాం. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులకు మాత్రమే కేటాయించాం. కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలంటే విద్యార్థుల్లో భయం పోవాలి. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. – రమేశ్కుమార్, డీఈవో, మెదక్
సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలి
పదో తరగతి విద్యార్థులంతా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానున్నది. ఉదయం 8.30 గంటలలోగా విద్యార్థికి సంబంధిత కేంద్రానికి చేరుకుంటే ఎలాంటి ఆందోళన ఉండదు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. విద్యార్థులు బాగా చదివి చక్కగా పరీక్షలు రాయాలి.
– నాంపల్లి రాజేశ్, డీఈవో, సంగారెడ్డి