మెదక్ మున్సిపాలిటీ, మే 21: పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతానికి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో కలిసి ముందుకెళ్లాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జూన్ 3 నుంచి నిర్వహించనున్న ‘పట్టణ ప్రగతి’పై మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతికి సంబంధించి గతంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రస్తుత కార్యచరణ రూపొందించుకుని పనులు చేపట్టాలన్నారు. కమిషనర్లు ‘పట్టణ ప్రగతి’పై నివేదికలను సిద్ధం చేసి జూన్ 2లోపు అందజేయాలన్నారు.
క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి..
‘తెలంగాణ క్రీడా ప్రాంగణం’ కార్యక్రమం ద్వారా మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఖాళీ స్థలాలను గుర్తించి చదును చేసి పిల్లలు ఆడుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్లకు సూ చించారు. మెదక్ మున్సిపాలిటీలో మూడు, రామాయంపేట మున్సిపాలిటీలో రెండు క్రీడా ప్రాంగణాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 2వరకు షెడ్యూల్ రూపొందించి కార్యక్రమానికి ఒకరోజు ముందు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు సందర్శించాలన్నారు. ఐదు వార్డులకు ఒక ప్రకృతి వనాన్ని కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. వార్డుల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తించేందుకు ఆదివారం వార్డుల్లో సందర్శించి ప్రకృతి వనాల ఏర్పాటు చేసే ప్రదేశాలను గుర్తించి అందుకు సంబంధించిన పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొక్కల పెంపకం, తదితర అంశాలని వివరిస్తూ కౌన్సిలర్లు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మెదక్, రామయంపేట మున్సిపల్ కమిషనర్లు శ్రీహరి, శ్రీనివాసన్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.