కొమురవెల్లి, మే 20 : అభివృద్ధిని అడ్డుకునేందుకే పొన్నాల లక్ష్మయ్య యాత్ర చేస్తున్నాడని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో రూ.4 లక్షల జడ్పీ నిధులతో చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, సర్పంచ్ సద్ది కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడక ముందు వేసవి వచ్చిందంటే గ్రామాలకు ప్రజాప్రతినిధులు వస్తే ఖాళీ బిందెలతో మహిళలు ఎదురుపడేవారని, నేడు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో రైతులు పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణకు వచ్చి పని చేసుకుంటున్నారని, ఇది సీఎం కేసీఆర్ పాలనదక్షతకు నిదర్శమన్నారు. నాడు వీడిపోతే తెలంగాణ చీకట్లో ఉంటోందని ప్రచారం చేశారని, సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణలో 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారన్నారు.
ఇతర రాష్ర్టాలు చీకట్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య జీవోల పేరుతో నీళ్లు వదులకుండా మురుగబెట్టాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, రూ.2వేలు పింఛన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 60 ఏండ్లు కాంగ్రెస్ పాలనలో జనగామ నియోజకవర్గంలో 101 ఓవర్హెడ్ ట్యాంకులుంటే, టీఆర్ఎస్ పాలనలో 500 ట్యాంకులు నిర్మించామన్నారు. 15 ఏండ్లుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి నరేంద్రమోదీ చేయని పనులు సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులతో పాటు అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పిన కేంద్రం వద్ద ఈ బుడ్డరఖాన్ రేవంత్రెడ్డి, తొండి సంజయ్ ధర్నాలు చేయాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ లాల్భగన్, రసూలాబాద్ సర్పంచ్ స్వామిగౌడ్, నాయకులు కృష్టారెడ్డి, చదరుపల్లి నర్సింగరావు, సిలువేరు కనకమల్లేశం, బండి పరశురాములు పాల్గొన్నారు.