దుబ్బాక, మే 20 : కొనుగోలుదారులు, అమ్మకందారులకు వేదికగా సమీకృత మార్కెట్ సముదాయాన్ని నిర్మించేందుకు దుబ్బాక మున్సిపల్ పాలకవర్గం తీర్మానించింది. శిథిలావస్థకు చేరిన దుబ్బాక పాత దవాఖాన స్థలంలో నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.3.80కోట్లు మంజూరు చేసింది. శాఖాహార, మాంసాహార విక్రయశాలలను ఒకే చోట నిర్మించేందుకు పనులు చేపడుతున్నారు. గత ఎన్నో ఏండ్లుగా చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి రైతులు పండించిన తమ కూరగాయలను తెచ్చి, రోడ్డుపైనే విక్రయాలు చేపడుతున్నారు. ఎన్నో ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన పాలక వర్గం, సమీకృత మార్కెట్ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసింది.
రైతులు, వ్యాపారులకు తప్పనున్న ఇబ్బందులు..
ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గ్రహించిన పాలకవర్గం, సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయాలని భావించింది. శిథిలావస్థకు చేరిన పాత దవాఖాన స్థలాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. రైతులతో పాటు మటన్, చికెన్, చేపల వ్యాపారులతో పాటు కిరాణ సముదాయాల నిర్వాహకులకు ఇబ్బందులు తొలగించే విధంగా దుకాణ నిర్మాణాలను చేపడుతుండడంతో ఏండ్ల నుంచి ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.
100 పడకల దవాఖాన రావడంతో..
దుబ్బాకలో ప్రాధమి ఆరోగ్య కేంద్రంగా ఏర్పడిన సర్కారు దవాఖాన క్రమక్రమేపి 30 పడకల దవాఖానగా, అనంతరం వంద పడకల దవాఖానగా మార్పు చెందింది. 2017లో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఈ దవాఖానలో అదనపు గదులను ఏర్పాటు చేసి, సామాజిక ఆరోగ్యకేంద్రంగా మార్చు చేశారు. ఐదు నెలల వరకు సామాజిక ఆరోగ్య కేంద్రంగా సేవలందించిన సర్కారు దవాఖాన భవనం శిథిలాసవ్థకు చేరడంతో పాటు దుబ్బాకకు వంద పడకల దవాఖాన మంజూరైంది. సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని వంద పడకల దవాఖానలోకి మార్చేశారు.
చురుకుగా పనులు..
దుబ్బాకలో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్ సముదాయ పనులు మొదలయ్యాయి. పాత దవాఖాన స్థలంలో కూల్చివేతలు వేగంగా కొనసాగుతున్నాయి. ఒక ఎకరం మూడు గుంటల స్థలంలో ఉన్న పాత దవాఖాన భవనం తొలగించి, ఇక్కడ సమీకృత కూరగాయల మార్కెట్ భవనం నిర్మిస్తున్నారు. రూ.3.80 కోట్లతో అధునాతన హంగులతో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవనం నిర్మించనున్నారు.
త్వరలోనే భవన నిర్మాణ పనులు..
దుబ్బాక పాత సర్కా రు దవాఖాన భవనం శిథిలావస్థకు చేరడంతో ఆ భవనం కూల్చివేయడం జరుగుతున్నది. దుబ్బాకకు మంజూరైన సమీకృత కూరగాయల మార్కెట్ భవనం పాత దవాఖాన స్థలంలో నిర్మించేందుకు తీర్మానించారు. వెజ్ అండ్ నాన్ వేజ్ మార్కెట్ భవనానికి రూ.3.80 కోట్లు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన టెం డర్లు కూడా పిలిచాం. దీంతో పాత దవాఖాన భవన కూల్చివేత పనులు మొదలు పెట్టాం. అనంతరం సమీకృత కూరగాయల భవనం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.
– గణేశ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక