రామాయంపేట, మే 20 : లింకు రోడ్లు పల్లె ప్రాంతాలకు కొత్తకళను తెచ్చిపెడుతున్నాయి. పల్లెలే.. దేశానికి పట్టుకొమ్మలన్న గాంధీజీ కలను నేడు తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఏ నాయకుడు కూడా రోడ్లపై కనీసం తట్టెడు మట్టిని కూడా పోయలేని వారికి తెలంగాణ ప్రభుత్వం గట్టి గుణపాఠం చెబుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని గ్రామీణ ప్రాంత వాసులే తెలుపుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోఎక్కడ కూడా జరుగని లింకు రోడ్ల నిర్మాణం పనులు కేవలం రామాయంపేట, నిజాంపేట ఉమ్మడి మండలాల్లో ఎక్కడ చూసినా రెండు మండలాలను కలిపే సీసీ రోడ్లు, బీటి రోడ్లే మనకు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పటు కావడంతో మొట్టమొదటగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పల్లె ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఐదేండ్ల కిందటే రోడ్ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు.
ముఖ్యంగా గిరిజన ప్రాంత వాసులకు వారి ఇంటి నుంచి వెళ్లి.. మళ్లీ తిరిగి రావాలంటేనే గగనమవుతుండే. ఇప్పుడు నేరుగా ఏ రాత్రయినా ఇంటికి దర్జాగా ఎలాంటి ప్రమాదాలు లేకుండా వెళ్తున్నామని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట, నిజాంపేట మండలాల వ్యాప్తంగా మొత్తం 58 కిలోమీటర్ల మేర లింకు రోడ్లు పూర్తయ్యాయి. బచ్చరాజుపల్లె నుంచి రాయిలాపూర్, చల్మెడ నుంచి నిజాంపేట, నిజాంపేట నుంచి రజాక్పలి,్ల కల్వకుంట, తిప్పనగుళ్ల, బచ్చరాజుపల్లె నుంచి డి.ధర్మారం, డి.ధర్మారం నుంచి నార్లాపూర్, కల్వకుంట, లక్ష్మాపూర్ నుంచి దంతెపల్లి, పర్వతాపూర్, కాట్రియాల నుంచి దంతెపల్లి, లక్ష్మాపూర్ తొనిగండ్ల, ఝాన్సీలింగాపూర్ పలు గిరిజన తండాల్లో కూడా పనులు పూర్తయ్యాయి.ముఖ్యంగా సుతారిపల్లె, శివాయపల్లె గ్రామస్తులు తమ గ్రామాలకు వెళ్లే రోడ్డు కోసం పడరాని ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రావడంతోనే తమ గ్రామాల మీది నుంచి ఇతర ప్రాంతాలకు కూడా రోడ్డు వేయడం శుభ పరిణామమని గ్రామస్తులు అంటున్నారు.
రామాయంపేట మండలాభివృద్ధికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే గ్రామాలు పల్లె ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కలిగింది. గతంలో మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడే వాళ్లం. ప్రస్తుతం ఉమ్మడి మండలంలోని లింకురోడ్లన్నీ పూర్తయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నారు.. ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.