సంగారెడ్డి, మే12: సంగారెడ్డి జిల్లాలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది. పాడైన రోడ్ల పునరుద్ధరణకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేసి ప్రభుత్వానికి నివేదించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసేందుకు ఫిబ్రవరిలో జిల్లాకు విచ్చేసిన సీఎం కేసీఆర్కు బీటీ రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరుచేయాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. వెంటనే సీఎం స్పందించి అంచనాలు రూపొందించి పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల ప్రకారం జిల్లాలో 289 పనులను గుర్తించిన అధికారులు, అందుకు అవసరమైన నిధులకు నివేదికలు సిద్ధ్దం చేసి ప్రభుత్వానికి పంపించారు. 828.49 కిలోమీటర్లకు బీటీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని, అందుకు రూ.292.61కోట్ల అంచనాలు తయారు చేసి సర్కార్కు అందజేశారు. నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారుల సమాచారం. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు అనుమతులు రాగానే పనులకు శ్రీకారం చుట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
గ్రామాలకు లింకు రోడ్లతో మార్గం సుగమం
గ్రామాలకు లింకు రోడ్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన తెలంగాణ సర్కారు, గ్రామం నుంచి మండల కేంద్రానికి లింకు రోడ్లు ఏర్పాటు చేసింది. అలాగే మండల కేంద్రం నుంచి జిల్లాకేంద్రానికి రోడ్లను రెండు వరుసలుగా అభివృద్ధి చేసింది. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ప్రజలు సులువుగా వారివారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి బీటీ రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరు రాగానే, బీటీ ప్యాచ్లు, ఇతర మరమ్మతుల పనులు పూర్తి చేయనున్నారు.
అత్యధికంగా జహీరాబాద్ డివిజన్లో..
సరిహద్దుల్లో ఉన్న జహీరాబాద్ డివిజన్లో అత్యధికంగా బీటీ రోడ్ల రెన్యువల్స్ ఉన్నాయి. 4 కిలోమీటర్ల నుంచి 15కిలోమీటర్లలోపు బీటీ రెన్యువల్స్ రోడ్లకు ప్రతిపాదించిన నిధులతో కొత్తగా రూపుమారనున్నవి. గంగ్వార్ పీడబ్ల్యూడీ నుంచి బీదర్ పీడబ్ల్యూటీ రోడ్ రాజోల వయా మెటల్ కుంట, కల్బెముల్ వరకు 12.63 కిలోమీటర్లకు రూ.36.19లక్షలు, కోహీర్ వయా గుర్వాడ వరకు 11.82కిలోమీటర్లు రూ.35లక్షలు, కోహీర్ వయా పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ వరకు 11.60కిలోమీటర్లకు రూ.36.29లక్షలు, ఝరాసంఘం పీడబ్ల్యూడీ రోడ్ నుంచి పెద్దచల్మెడ చౌరస్తా వయా జీర్లపల్లి, బొప్పనపల్లి, బోరేగావ్ వరకు 10.65 కిలోమీటర్లకు రూ.40.94లక్షలు, జాతీయ రహదారి-65 నుంచి మన్నాపూర్ వయా కంజమ్లాపూర్, ఇప్పపల్లి వరకు 9.20కిలోమీటర్లకు రూ.25లక్షలు, జహీరాబాద్ నుంచి పొట్టిపల్లి వయా అల్గోల్ వరకు 8.80కిలోమీటర్లకు రూ.51.70లక్షలు, పిచరాగడీ నుంచి బీలాల్పూర్ వయా సజ్జాపూర్ వరకు 8.42కిలోమీటర్లకు రూ.35లక్షలు, చాల్కి నుంచి కర్ణాటక సరిహద్దు వయా రత్నాపూర్, మల్గి వరకు 8.39కిలోమీటర్లకు రూ.45లక్షలు, చిల్మామిడి జడ్పీ రోడ్ నుంచి కంకోల్ పీడబ్ల్యూడీ రోడ్ వరకు 8.03కిలోమీటర్లకు రూ.40లక్షలు నిధులతో బీటీ రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
సంగారెడ్డి డివిజన్లో..
మారేపల్లి నుంచి చీమల్దరి కోనాపూర్ వరకు 8.50కిలోమీటర్లకు రూ.44.24లక్షలు, ఆత్మకూర్ నుంచి సింగూరు ప్రాజెక్టు వరకు 7.51కిలోమీటర్లకు రూ.41.94లక్షలు, 65వ జాతీయ రహదారి నుంచి ఇంద్రకరణ్ వయా చెర్యాల్ వరకు 6.94కిలోమీటర్లకు రూ.41.79లక్షలు, సదాశివపేట నుంచి మాచిరెడ్డిపల్లి ఆర్అండ్బీ రోడ్ వయా వెంకటాపూర్ వరకు 6.68కిలోమీటర్లకు రూ.39.82లక్షలతో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
పటాన్చెరు డివిజన్లో..
పటాన్చెరు డివిజన్లోని పీడబ్ల్యూడీ రోడ్ గుమ్మడిదల నుంచి నాగిరెడ్డిగూడ, కొత్తపల్లి జడ్పీ రోడ్ వరకు 5.06కిలోమీటర్లకు రూ.29.50లక్షలు, లక్డారం నుంచి బేగంపేట వరకు 4.82కిలోమీటర్ల వరకు రూ.25.43లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి కొత్తపల్లి వయా లక్ష్మాపూర్ వరకు 4.31కిలోమీటర్లకు రూ.29.38 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి కానుకుంట వయా సిక్లిందాపూర్ ఆలయం వరకు 4.05కిలోమీటర్లకు రూ.28.84లక్షల నిధులతో రోడ్ల పునరుద్ధరణ చేపట్టనున్నారు.
అందోల్ డివిజన్లో..
అందోల్ డివిజన్లోని అల్లీపూర్ కమ్మంపల్లి చౌరస్తా నుంచి సింగూర్ వయా బుసారెడ్డి వరకు 8.80కిలోమీటర్లకు రూ.450 లక్షలు, రాయికోడ్ పీడబ్ల్యూడీ రోడ్ నుంచి పీపడ్పల్లి వయా నల్లంపల్లి, మహమ్మదాపూర్ వరకు 7కిలోమీటర్లకు రూ.245 లక్షలు, కోడూర్ నుంచి కొండారెడ్డిపల్లి చౌరస్తా రోడ్ వయా కోడూర్ వరకు 6.70కిలోమీటర్లకు రూ.210లక్షలు, అచ్చన్నపల్లి నుంచి టేక్మాల్ వరకు 6.10కిలోమీటర్లకు రూ.183లక్షలు, అల్లాదుర్గం ఎల్లమ్మ ఆలయం రుంచి చేవెళ్ల వరకు 5.24కిలోమీటర్లకు రూ.131లక్షల నిధులతో పనులు చేపట్టనున్నారు.
నారాయణఖేడ్ డివిజన్లో..
నారాయణఖేడ్ డివిజన్లోని పీడబ్ల్యూడీ రోడ్ నుంచి తడ్కల్ మీదుగా బొర్గి వయా ఎడ్లరేగడి తండా వరకు 9.52కిలోమీటర్లకు రూ.244లక్షలు, కంగ్టి పీడబ్ల్యూడీ రోడ్ నుంచి నిజామాబాద్ జిల్లా సరిహద్దు వయా చౌకన్పల్లి,బొర్గి వరకు 7.95కిలోమీటర్లకు రూ.258.50లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి బాచేపల్లి వయా రాపార్తి, మీర్ఖాన్పేట్ వరకు 7.72కిలోమీటర్లకు రూ, 248.60లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి గోప్యనాయక్ తండా వయా హంగర్గా వరకు 7.67కిలోమీటర్లకు రూ.34.70 లక్షలు, 161వ జాతీయ రహదారి-బీ నుంచి బంధన్పల్లి వయా జుక్కల్, చందాపూర్, సత్యగావ్, అనంతసాగర్ వరకు 7.15కిలోమీటర్లకు రూ.107.25లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి శమతండా వరకు 7.15కిలోమీటర్లకు రూ.107.25 లక్షల చొప్పున చేపట్టేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చొరవ
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. నార్సింగి నుంచి మీర్జాపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను, మిర్జాపల్లి రైల్వే స్టేషన్ను స్థానిక నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పనులు పరిశీలించి, నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గ్రామస్తులు వెళ్లడానికి బ్రిడ్జి నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి హరీశ్రావు చొరవతో రూ.13 కోట్లతో నార్సింగి నుంచి మిర్జాపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మిర్జాపల్లిలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆగేందుకు రైల్వే అధికారులను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నార్సింగి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మైలరాం బాబు, సొసైటీ చైర్మన్ శంకర్గౌడ్, మాజీ చైర్మన్ తౌర్యనాయక్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, మండల రైతు బంధు అధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, మాజీ టెలికాం బోర్డు సభ్యులు అంచనూరి రాజేశ్, భూపతి పాల్గొన్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలో బీటీ రోడ్ల పునరుద్ధరణ, ప్యాచ్వర్క్లు, చిన్న కల్వర్టులు, మట్టి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే పనులు చేపడతాం. ప్రతిపాదనలు ఆర్థిక మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లాం. శాఖాపరంగా జిల్లాలో ఏఏ రోడ్లకు బీటీ అవసరమున్నదే, ఆ రోడ్లనే గుర్తించి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కావడమే అలస్యం, పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాం.
– జగదీశ్వర్, పీఆర్ ఈఈ సంగారెడ్డి