మెదక్ జిల్లాలో సాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. మండు వేసవిలోనూ చెక్డ్యాంలు జలకళతో దర్శనమిస్తున్నాయి. మెదక్ జిల్లాలో చెక్డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 119.11 కోట్లు నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని మంజీరపై 9 చెక్డ్యాంలు, హల్దీవాగుపై 6 చెక్డ్యాంలు నిర్మిస్తున్నారు. ఇందులో మంజీరాపై నిర్మిస్తున్న 9 చెక్డ్యాంల్లో నాలుగు పూర్తయ్యాయి. మరో ఐదు 70 శాతం పనులు పూర్తయ్యాయి. హల్దీవాగుపై నిర్మిస్తున్న 6 చెక్డ్యాంలు 5 పూర్తి కాగా, ఒకే ఒక్క చెక్డ్యాం పనులు కొనసాగుతున్నాయి.
మెదక్, మే 12 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో 25 చెక్డ్యాంలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.119.11 కోట్లు మంజూరు చేసింది. మెదక్ మండలం ర్యాలమడుగు చెక్డ్యాంకు రూ. 20 కోట్లు కేటాయించగా, జిల్లాలోని మిగతా చెక్డ్యాంలకు నిధులు మంజూరు చేయడంతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మంజీరాపై 9 చెక్డ్యాంలు నిర్మించగా, ఇప్పటి వరకు నాలుగు పూర్తయ్యాయి. మరో ఐదు చెక్డ్యాంలు 70 శాతం పనులు పూర్తయ్యాయి. హల్దీ వాగుపై 6 చెక్డ్యాంలు నిర్మించగా, ఐదు పూర్తికాగా, ఒకే ఒక్క చెక్డ్యాం చివరి దశలో ఉన్నది. జిల్లాలోని చెక్డ్యాంల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలు పండే విధంగా చెక్డ్యాంలు జలకళను సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. సాగు కోసం ప్రాజెక్టులను నిర్మించి ఆ నీటినీ చెక్డ్యాంల గుండా భూముల్లోకి వచ్చేలా చూస్తున్నారు. అంతేకాకుండా పంట పెట్టుబడి సాయం కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.10వేలను రైతు బంధు కింద అందజేస్తున్నారు. రైతు మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవడానికి రైతు భీమా పథకంతో రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే.
మండు వేసవిలోనూ చెక్డ్యామ్లు నిండుగా..
మెదక్ జిల్లాలోని హల్దీవాగు, మంజీరాపై నిర్మించిన చెక్డ్యాంలు జలకళను సంతరించుకుంటున్నాయి. మండు వేసవిలోనూ చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లాలోని మంజీరతో పాటు హల్దీవాగు, ఘనపూర్ ఆనకట్ట కింద ఉన్న భూములు సస్యశ్యామలం కానున్నాయి. వర్షాకాలంలో వర్షపు నీరు వాగులు, కాల్వల ద్వారా చెరువుల్లోకి వెళ్లి వృథాగా పోయేవి. చెక్డ్యాంల నిర్మాణంతో నీటి నిల్వలతో పాటు సమీప ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. పంటల సాగుతో పాటు చేపల పెంపకానికి అనుకూలంగా మారింది.
పెరగనున్న భూగర్భ జలాలు..
మెదక్ జిల్లాలోని చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరగనున్నాయి. పరిసర ప్రాంతాల్లోని రైతుల భూములకు సాగునీరు అందుతోంది. దీంతో బోరు బావుల్లో నీరు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది. చెక్డ్యాంల నుంచి రైతుల పొలాల్లోకి నీరు వెళ్లిన తర్వాత మిగిలిన నీరు తిరిగి చెరువుల్లోకి చేరనున్నది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయి లో సాగునీరు అందనున్నది.
15 చెక్డ్యాంలకు.. రూ.119.11 కోట్లు
జిల్లాలో 15 చెక్డ్యాంలకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.119.11 కోట్లు మంజూ రు చేసింది. జిల్లాలోని మంజీరపై 9 చెక్డ్యాంలు, హల్దీవాగుపై 6 చెక్డ్యాంలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే చెక్డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నది. రైతులు పంటలు బాగా పండించుకోవడానికి మంచి అవకాశం. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది.
-శ్రీనివాస్రావు, ఇరిగేషన్ శాఖ ఈఈ