కోహీర్, మే12: ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలతో ఓ యువరైతు చెరుకు పంటను సాగు చేసి రికార్డు సృష్టించాడు. వ్యవసాయం అంటే ఎంతో మక్కువ ఉన్న ఆ రైతు, తన పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరుణ్కుమార్. ఆ యువరైతుకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. ఒక ఎకరంలో చెరుకు పంటను సాగు చేశాడు.
ఎకరానికి రూ.30వేలను ఖర్చు చేశాడు. చెరుకు దున్నకం, కూలీల ఖర్చు, విత్తనం కొనుగోలు కోసం వెచ్చించాడు. మూడున్నర టన్నుల చెరుకు విత్తనం సరిపోయింది. బోరుబావి ద్వారా సాగునీటిని అందించాడు. 11నెలలకు పంట కోత దశకు చేరింది. కూలీల సాయంతో కత్తిరించాడు. పలు ప్రాంతాల మార్కెట్కు తరలించాడు. ఎకరంలో 50 టన్నుల దిగుబడి సాధించాడు. అన్ని ఖర్చులు పోను, రూ.1.50లక్షల ఆదాయం పొందాడు. ఎకరానికి ఇంత మంచి ఆదాయాన్ని పొందిన యువ రైతును గ్రామస్తులు అభినందించారు. ప్రభుత్వం అందించిన నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు పెట్టుబడి సాయం తనకు ఎంతగానో మేలు చేసిందని రైతు అరుణ్కుమార్ ప్రభుత్వ తీరును ప్రశంసించారు. రైతన్నల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వానికి సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.