మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21: పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన పాఠశాల యాజమాన్య కమిటీల కాల పరిమితిని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్లో పాఠశాల యాజమాన్య కమిటీలను ఎన్నుకున్నారు. వీరే పాఠశాల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండేండ్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ కమిటీల గడవు మరో 6 నెలలు పొడిగించింది. దీంతో పాత కమిటీలే 2022 మే 31 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మన ఊరు- మన బడి కార్యక్రమం అమలులో ఈ కమిటీలు కీలకం కావడంతో వాటినే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ కమిటీలు నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి.
పర్యవేక్ష బాధ్యత కమిటీలదే..
పాఠశాల పనితీరు, హాజరు శాతం పెంచడం, బడి బయట పిల్లలను చేర్పించడం, విద్యార్థుల ప్రగతి, మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఉపాధ్యాయుల మెరుగైన బోధన విషయాలు, నిధులు తదితర విషయాలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
మెదక్ జిల్లాలో 905 పాఠశాలలు
జిల్లాలో 905 పాఠశాలల్లో 627 ప్రాథమిక, 133 ప్రాథమికోన్నత, 145 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 93 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురుకుల, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 2019 నవంబర్లో జరిగాయి. మే వరకు కొనసాగుతాయి. ప్రభుత్వం తాజాగా 6 నెలలు పొడిగించడంతో నవంబర్ వరకు ఈ కమిటీలే కొనసాగుతాయి.