న్యాల్కల్, ఏప్రిల్ 19: స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, “భోలో సిద్ధివినాయక మహరాజ్కీ.. జై” అంటూ భక్తుల నినాదాలతో మార్మోగింది. సిద్దివినాయక స్వామివారికి ఇష్టమైన రోజు, మంగళవారం వచ్చే పవిత్రమైన అంగారక సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్థరాత్రి ఒంటి గంట నుంచే వేదపండితులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, హారతి తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సిద్ధి,బుద్ధి సామేత వినాయకుడి కల్యాణోత్సవం కన్నుల పండువుగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆయా రోడ్డు మార్గాల్లో పాదయాత్రగా వస్తున్న భక్తులకు పలువురు దాతల ఆధ్వర్యంలో పూలిహోర, పండ్లు, పాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్, బీదర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. ఆలయ కమిటీ, పలువురు దాతలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు ఆధర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ భరత్కుమార్, హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్ పర్యవేక్షణలో బందోబస్తు చేపట్టారు. కాగా, మండలంలోని హద్నూర్, చీకూర్తి గ్రామాల్లోని వర, సిద్ధివినాయక ఆలయాల్లో అంగార సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారిని దర్శించుకున్న మంత్రి హరీశ్రావు..
అంగార సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా సిద్ధివినాయక స్వామివారిని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, టీఎస్ఎంఐడీసీ ఎర్రోళ్ల శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఆర్డీవో రమేశ్బాబు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు దేవేందర్రెడ్డి, తనీర్ హైమద్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు వేదపండితులు పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ అంగార సంకష్టహర చతుర్థి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రూ.56 లక్షలతో నిర్మించిన ఫ్లాట్ఫాం, సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.