కొల్చారం, ఏప్రిల్ 16:వనదుర్గా(ఘన్పూర్) ప్రాజెక్టు ఎత్తు పెంపునకు అడ్డంకులు తొలగాయి. భూసేకరణకు చెల్లించాల్సిన రూ.8.10 కోట్లు రెవెన్యూ శాఖకు ప్రభుత్వం విడుదల చేసింది. నోటిఫికేషన్ ఇచ్చి, రైతులకు పరిహారం చెల్లించి ఈనెలాఖరులోపు పనులు ప్రారంభించనున్నారు. వచ్చే వానకాలంలోపు పనులు పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. నిజాం పాలకుల కాలంలో సుమారుగా వందేళ్ల క్రితం కొల్చారం మండలంలోని చిన్నఘన్పూర్ శివారులో వనదుర్గా (ఘన్పూర్) ప్రాజెక్టు నిర్మాణమైంది. మంజీరానదిపై 0.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ద్వారా కొల్చారం, మెదక్, పాపన్నపేట, హవేళీఘన్పూర్ మండలాల్లో సుమారుగా 21,625 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఈ ప్రాజెక్టు నుంచి మహబూబ్నహార్(ఎంఎన్) కాలువ 43 కి.మీలు ఉండగా, కొల్చారం, మెదక్, హవేళీఘన్పూర్ మండలాలకు, ఫతేనహార్(ఎఫ్ఎన్) కాలువ 43 కి.మీలు ఉన్నది. పాపన్నపేట మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా కాలువలను డిజైన్ చేసి నిర్మించారు.
సింగూరు ప్రాజెక్టులో 0.4 టీఎంసీల నీటి వాటా ఉండగా, ఏడాదిలో వానకాలం, యాసంగి సీజన్లలో నీటిని విడుదల చేస్తారు. సింగూరు నుంచి ఘన్పూర్ ప్రాజెక్టుకు నీరు చేరగానే నీటిపారుదలశాఖ అధికారులు నీటిని కాలువలకు విడుదల చేసిన మూడు, నాలుగు రోజులకే నీళ్లు అయిపోతున్నాయి. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక, శిథిలావస్థకు చేరిన తూములతో నీటినిల్వ సామర్థ్యం తగ్గి స్థిరీకరించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. కేవలం 10వేల ఎకరాలకు మాత్రమే నీరందుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఈ ప్రాజెక్టును పరిశీలించి ఎత్తు పెంపుదల కోసం నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు రూ.43.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.
దీంతో 2016లోనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రాజెక్టు ఎత్తు 1.75 మీటర్ల మేర పెంచడంతో గతంలో స్థిరీకరించిన ఆయకట్టుకు అదనంగా 5వేల ఎకరాల ఆయకట్టు పెరిగేలా అధికారులు డిజైన్ చేశారు. నిధులు మంజూరు కాండంతో ప్రాజెక్టు పొడవు 724.5 మీటర్లు ఉండగా, 700 మీటర్ల పొడవునా అవసరమైన రక్షణ(అప్రాన్) పనులు చేపట్టారు. ప్రాజెక్టుకు ఇరుపక్కల మూడున్నర కిలోమీటర్ల పొడవున మట్టి పనులు చేపట్టడంతో భూములు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చేపట్టడంతో అప్పట్లో పనులు నిలిపివేశారు.
భూసేకరణకు రూ. 8.10 కోట్లు మంజూరు
ప్రాజెక్టు ఎత్తు పెంపుతో పాపన్నపేట మండలంలోని నాగ్సాన్పల్లి, కొడపాక, చిత్రియాల్లో 295 మంది రైతులకు చెందిన 128 ఎకరాలు, కొల్చారం మండలంలోని సంగాయిపేట, చిన్నాఘన్పూర్ గ్రామాలకు చెందిన 95మంది రైతులకు సంబంధించి 63 ఎకరాల భూములు ముంపునకు గురికానున్నట్లు అధికారులు గుర్తించారు. భూమి ఇచ్చేందుకు పాపన్నపేట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు ముందుకు రాగా, కొల్చారం మండల రైతులు పరిహారం సరిపోదని అభ్యంతరం తెలిపారు. భూసేకరణకు అప్పట్లోనే రూ.5 కోట్లు మంజూరు అయినప్పటికీ, భూములు కోల్పోయే రైతులు పరిహారం ఎక్కువ డిమాండ్ చేయడంతో పంపిణీ సాధ్య పడలేదు. తాజాగా ప్రభుత్వం రూ.8.10 కోట్లు మంజూరు చేయడంతో కొల్చారం మండల రైతులు సైతం అంగీకరించారు. దీంతో ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
నెలాఖరులోపు పనులు ప్రారంభిస్తాం..
ఇప్పటికే 700 మీటర్ల మేర అప్రాన్ పనులు చేపట్టాం. కొల్చారం మండలంలోని చిన్నఘన్పూర్ వైపు రెండు కిలోమీటర్లు, పాపన్నపేట మండలంలోని నాగ్సాన్పల్లి వైపు ఒకటిన్నర కిలోమీటర్లు మట్టి పనులు చేపట్టాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి నిధులు రెవెన్యూశాఖ వద్ద ఉన్నాయి. త్వరలో రైతులకు పరిహారం పంపిణీ చేస్తూనే, ఈ నెలాఖరులోపు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తాం.
– శివనాగరాజు, డీఈ, నీటిపారుదల శాఖ, మెదక్