మెదక్, ఏప్రిల్ 6 : వేసవిలో లభించే నేరేడు పండ్లు పోషకాల గని.. అనారోగ్య నివారిణి. నేరేడు పండు మాత్రమే కాదు చెట్టు, ఆకులు, బెరడు కూడా వ్యాధులను నయం చేసేందుకు సహాయపడుతాయి. నేరేడు పండు శాస్త్రీయనామం షైజీజీఎం క్యూమిని ఇది మిర్టెసీ కుటుంబానికి చెందినది. మన దేశంలో విరివిరిగా లభించే ఈ నేరేడుని అల్లనేరేడుగా పిలుస్తారు. ఇవి తీపి, వగరు, రుచులను కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఈ నేరేడు పండు ఇప్పటిది కాదు.. రాముడు వనవాస సమయంలో ఎక్కువగా నేరేడు పండ్లు తినట్లు భారతీయ చరి త్ర చెబుతున్నది.
నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు
ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండేందుకు నేరేడు పండ్లు ఎంతో ఉపయోగపడుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవాళ్లకు ఇవి చాలా మంచివి.
మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఈ నేరేడు పండ్లు తింటే ఉపశమనం లభిస్తుంది.
గర్భిణులు తింటే తల్లి, బిడ్డకు చాలా మంచిది. దీని వల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు హార్ట్ బీట్ చక్కగా ఉండేందుకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
నేరేడులో విటమిన్ సీ, ఏ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది.
క్యాల్షియం, పొటాషియం. ఐరన్, విటమిన్ సీ అధిక మోతాదులో ఉండడంతో రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
ఈ నేరేడు పండు ఆకులను దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కిలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
ఈ నేరేడు పండు ఆకు రసంలో పసుపును కలిపి దద్దుర్లు ఉన్న చోట పూస్తే ఉపశమనం లభిస్తుంది.
జిగుట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాల నేరేడు రసం తీసుకుంటే శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటుంది.
జ్వరం ఉన్నప్పుడు ధనియాల పొడిలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీరతాపం తగ్గుతుంది.
నేరేడు పండ్లకు రక్తాన్ని శుద్ధి చేసే గుణంతో పాటు నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే గాయాలు త్వరగా మానుతాయి.