అందోల్/కోహీర్, మార్చి 20: వేసవికాలం ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మే మాసంలో భగ..భగమండే భానుడు మార్చి నెలలోనే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 38డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 11గంటలు అయ్యిందంటే ప్రజలు కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. సూర్యుడు నిప్పు లు కురిపించడంతో ఇంట్లో నిప్పుల కుంపటిని తలపిస్తోంది. దీంతో దాహం, నీరసం, అలసటతో జనాలు నీరసపడిపోతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వేసినా ఒక్కటే ఉక్కపోత. ఇలాంటి సమయంలోనే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలాల ఆస్వాదించవచ్చంటున్నారు వైద్యులు.
వడదెబ్బ లక్షణాలు..
ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట తిరిగే వారిలో విపరీతమైన జ్వరంతో నాడీ వేగంగా కొట్టుకోవడం. తలనొప్పి, చికాకు, కండరాల నొప్పి, ముదరు రంగులో మూత్రం, చర్మం వాడిపోవడం, స్పృహ తప్పిపోవడం జరుగుతుంది.
ప్రథమ చికిత్స
వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించాలి. వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి. వ్యక్తి శరీరంపై ఉండే దుస్తులను తొలిగించి చల్లటి నీటితో తుడువాలి. ఐసు ముక్కలను గుడ్డలో ఉంచి శరీరం అంతా రుద్దితే ఉపశమనం కలుగుతుంది. బాధితులకు చల్లని నీరు, ఉప్పు కలిపిన ఇతర లవణాలను తాగించాలి. బాధితుడిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని దవాఖానకు తరలించాలి.
తాటి ముంజలు ఎంతో ఉపయోగకరం
తాటి ముంజలు వేసవిలో మాత్రమే లభిస్తాయి. దీంతో వీటికి ఉండే ఆదరణ అంతా.. ఇంతకాదు. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో ఎక్కడ చూసినా పల్లెలు మొదలుకుని పట్టణాల్లో ముంజల విక్రయాలు విపరీతంగా సాగుతాయి. ధర కూడ తక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కవ ప్రాధాన్యతనిస్తారు.
పుచ్ఛకాయ
ఇక పుచ్ఛకాయలో నీటి శాతం ఎక్కవగా ఉండటంతో ఎండలో తిరిగే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అధికశాతం నీరే ఉండటంతో పాటు శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు ఉండటంతో పుచ్ఛకాయను అమితంగా ఇష్టపడుతారు.
ఎండలో తిరగకపోవడం మంచిది
ఎండాకాలంలో ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిది. ఎండలు విపరీతంగా మండుతుండటంతో శరీరం డీ హైడ్రేషన్కు గురికావడం, చెమట రూ పంలో నీరు బయటకు వెళ్లడం జరుగుతున్నది. దీంతో మన శరీరంలో నీటిశాతం తగ్గుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజులో తప్పనిసరిగా ఆరు లీటర్ల నీటిని తాగాలి. నల్లటి దుస్తు లు ధరించకూడదు. వదులుగా ఉండే కాటన్ దుస్తు లు ధరిస్తే మంచింది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే మాత్రం దగ్గరలోని దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
– డాక్టర్ రాజుగౌడ్
ఆలస్యం చేయొద్దు..
ఎండతీవ్రంగా ఉన్నప్పుడూ బయటకు రాకపోవడం మంచి ది. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెం టనే సమీపంలోనే దవాఖానకు తరలించి చికిత్స చేయించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమా దం జరిగే అవకాశం ఉంది. బయటకు వస్తే తెల్లటి దుస్తులు, టోపీ, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యుల సూచనలు, సలహాలను పాటించాలి.
– డాక్టర్ రాజ్కుమార్, కోహీర్ మండల వైద్యాధికారి
కొబ్బరి బొండాలు
కొబ్బరిబొండాల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా దవాఖాన, మందుల ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలున్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్రవిసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను దరిచేరనివ్వదు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే నీరసం చాలా వరకు తగ్గిపోతుంది. చెరుకురసం సైతం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచింది.
వేసవికాలం జాగ్రత్తలు :
ఆహార పదార్థాలలో నూనె వాడకం బాగా తగ్గించాలి.
ఆకు కూరలు ఎక్కువగా తినాలి.
ఉదయం పూట తినే టిఫిన్లో నూనె వంటలు కాకుండా ఆవిరి కుడుములు, ఇడ్లీలు తినడానికి ప్రాధాన్యతనివ్వాలి.
కర్బుజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ ఏ&డీ ఎక్కువగా శరీరానికి అందుతాయి.
కూల్ డ్రింక్ కన్నా కొబ్బరి నీళ్లు చాలా మంచివి.
కాఫీ, టీలకు వీలైనంత దూరంగా ఉండాలి.
కిటికీలకు, గుమ్మాలకు వట్టివేళ్లు తెరలని తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్ల ధనాన్ని ఇస్తుంది.
పాఠశాలలకు సెలవులు వస్తే సాధారణంగా పిల్లలు వేసవిలో ఎండలోకి వెళ్లి ఆటలు ఆడుతారు. వారు ఎండలోకి వెళ్లకుండ నీడలో ఆడుకునే ఆటలు నేర్పాలి.
పలుచని మజ్జిగలో నిమ్మకాయ, పుదీన, ఉప్పు వేసుకుని పిల్లలు, పెద్దలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బయట జ్యూస్లు తీసుకోకుండా అన్ని రకాల పండ్లతో ఇంట్లోనే తాజాగా జ్యూస్ తయారు చేసుకుని తాగితే బాగుంటుంది.
పిల్లలకు మజ్గిగా, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం,ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీళ్లతోపాటు గ్లాస్ నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ చక్కెర కలిపి
ఓఆర్ఎస్ ద్రావణంలా ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆలాగే మంచి నీరు సైతం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది.
బయటకు వెళ్లేముందు కల్లకు చల్లని అద్దాలు, తలపై టోఫీ తప్పకుండా పెట్టుకోవాలి.
50 ఏండ్లు పైబడిన వారు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే తప్పనిసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు విధిగా తీసుకెళ్లాలి.
ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకూడదు.
గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్నవారు ఎండలో అసలు తిరగకూడదు.
వేసవికాలంలో శరీరానికి అతుక్కుని, బిగుతుగా ఉండే దుస్తులను ధరించకపోవడం మంచిది.
ముఖ్యంగా ఆల్కహాల్, సిగరేట్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వీటి వినియోగంతో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్బాటిల్ తీసుకెళ్లాలి.