న్యాల్కల్, డిసెంబర్ 12 ః సమైక్య పాలనలో నిరాదరణకు గురైన విద్యావ్యవస్థ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో తిరిగి బలోపేతమవుతున్నది. ప్రైవేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సమకూర్చుతూ, పరిస్థితులకు చక్కదిద్దుకుంటూ పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందిస్తున్నది. సర్కారు బడుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం, సౌకర్యాల కల్పన కోసం శ్రీకారం చుట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం స్పీడందుకున్నది. మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టిన పనులు చకచకా కొనసాగుతున్నాయి. మండలంలో మొదటి దశలో ఎంపికైన 24 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల నూతన నిర్మాణాలు అందుబాటులోకి రాగా, మరికొన్ని చోట్ల చివరి దశలో ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.15 కోట్లను ఖర్చు చేస్తున్నది. సర్కారు బడుల్లో ఆంగ్ల విద్యాబోధనతో పాటు వసతుల కల్పనపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపికైన పాఠశాలలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మనఊరు-మనబడి కింద మొదటి విడతలో 24 జిల్లా పరిషత్ , మండల ప్రజాపరిషత్, మండల ప్రాథమిక పాఠశాలలు ఎంపికయ్యాయి. హద్నూర్, హుస్సేల్లి, ఇబ్రహీంపూర్, కల్బేమల్, మల్గి, మామిడ్గి, మెటల్కుంట, న్యాల్కల్, శంశోల్లాపూర్, వడ్డి, మిర్జాపూర్(బి), రత్నాపూర్ గ్రామాల్లో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని తెలుగు మీడియం, ఉర్దూ మీడి యం పాఠశాలలు, హద్నూర్, మామిడ్గి, మెటల్కుంట, మిర్జాపూర్(బి), న్యాల్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి.
విద్యార్థులకు మెరుగైన వసతులు..
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడుతున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, ఫ్లోర్టైల్స్, లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్స్, వంట గదులు, డైనింగ్ హాల్, పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం, నీటి తొట్టెలు, నల్లాలు, నీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు పాత వాటికి మరమ్మతు పనులు చురుగ్గా చేస్తున్నారు.
హాజరు శాతం పెరిగింది..
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులకు మౌలిక వసతులు సమకూరుతున్నాయి. అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తుండడంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి మా పాఠశాలలో చేరడం సంతోషంగా ఉంది. గతంతో పోలిస్తే హాజరు శాతం కూడా పెరిగింది. అభివృద్ధితో పాటు విద్యావ్యవస్థ పటిష్టం కోసం చేపట్టిన చర్యలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించేందుకు కృషి చేస్తున్నాం.
– బ్రహ్మయ్య, హెచ్ఎం, ఎంపీపీఎస్, మామిడ్గి (న్యాల్కల్ మండలం)
ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులు..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సర్కారు బడుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా అన్ని వసతులను కల్పిస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శించి చేపడుతున్న పనులు పరిశీలిస్తున్నాం. అధికారుల ఆదేశాల మేరకు అన్నీ నిబంధనల ప్రకారం జరిగేలా చూస్తున్నాం.
-మారుతీ రాథోడ్, ఎంఈవో, (న్యాల్కల్ మండలం)
నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం..
పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. మొదటి విడతలో మండలంలోని 24 పాఠశాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. మౌలిక వసతుల కోసం రూ.5.15 కోట్ల నిధులను మంజూరు చేసింది. అన్ని చోట్లా పనులన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గడువులోగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు సమకూ ర్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-కృష్ణజ్యోషి, పీఆర్ ఏఈ, న్యాల్కల్ మండలం