గుమ్మడిదల, నవంబర్26: వ్యాపారాలు చేసి నష్టాలు చవిచూడడంతో అక్రమంగా సంపాదించాలనే ఆలోచించారు ఆ ఇద్దరు. దీంతో దొంగతనాలు ఎలా చేయాలని ఆలోచించి ‘మెట్రో’ సినిమాను పలుమార్చు చూశారు. చోరీ ఎలా చేయాలో తెలుసుకుని పలు చోట్ల నేరాలకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో స్థానికంగా ఉన్న పాత నేరస్తులు కిశోర్ కుమార్, కిశోర్లను అనుమానితులుగా భావించి అదుపులో తీసుకుని విచారించారు. దీంతో వారు పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన వడ్డె నవీన్, వడ్ల భానుచందర్ పేర్లు తెలిపారు. వీరిద్దరు కలిసి అనేక చోట్ల చోరీలు చేశారని తేలింది. దీంతో వీరిద్దరిని పోలీసులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం వీరిని విచారించగా ఏడు చైన్ స్నాచింగ్లు, పలు చోట్ల నేరాలు చేసినట్లు బయటకొచ్చాయి. ఈ చైన్ స్నాచర్లు కొద్దికాలంగా గుమ్మడిదల పీఎస్ పరిధిలో రెండు, దుండిగల్, తూప్రాన్, మేడ్చల్, వెల్దుర్తి పీఎస్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీలకు పాల్పడినట్లు లిపారు.
దొంగిలించిన ఆభరణాలను పటాన్చెరులోని మణప్పురం ఫైనాన్స్లో తాకట్టు పెట్టి, వచ్చిన సొమ్మును ఇద్దరు సమానంగా పంచుకునేవారు. తాము చేసిన వ్యాపారాల్లో నష్టాలు రావడంతో అక్రమంగా సంపాదించాలనే ఆలోచనతో ‘మెట్రో’ సినిమాను పలుమార్లు చూసి చోరీ ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలోనే పలు చోట్ల ఆభరణాలను చోరీ, నేరాలు చేసినట్లు తెలిందని ఎస్సై తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెతలిపారు. డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్ సూచనల మేరకు చైన్ స్నాచర్లను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్నందున డీఎస్పీ భీంరెడ్డి, సీఎం వేణుగోపాల్ పోలీస్ సిబ్బందికి అభినందించారు.