పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా సంగారెడ్డి విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. జిల్లాలో ఉన్న 206 ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, 17 కేజీవీబీలు, పది మోడల్ స్కూళ్లలో 11వేల మంది విద్యార్థులు టెన్త్ చదువుతున్నారు. వీరంతా వచ్చే మార్చి నెలలో పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించారు.
ఇప్పటికే 60శాతం సిలబస్ పూర్తవగా, డిసెంబర్ నాటికి మొత్తం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి స్లిప్ టెస్టులు నిర్వహించి విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, మెరుగైన ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దనున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు ‘మనఊరు-మనబడి’ ద్వారా కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పిస్తుండడం, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ పెరుగుతున్నది. తమ పిల్లలను చేర్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు.
విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైనది. ఈ సారి ‘పది’ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. వంద శాతం ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని మెరుగుపరుస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ బడుల్లో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 9 నుంచి ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. జనవరి నుంచి సబ్జెక్టుల వారీగా రివిజన్, స్లిప్ టెస్టులు నిర్వహించనున్నారు.
సంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యనందజేసేందుకు కృషి చేస్తున్నది. ‘మనఊరు-మనబడి’ ద్వారా సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం బోధనను ప్రారంభించింది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పరీక్షల్లో ఏటా మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సైతం పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ ఇప్పటి నుంచే చర్యలు మొదలుపెట్టింది.
గతేడాది రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా పది ఫలితాల్లో మూడో స్థానంలో నిలవగా, ప్రస్తుతం వందశాతం ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. అందుకు అనుగుణంగానే విద్యార్థులను సన్నద్దం చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 206 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 17 కేజీవీబీలు, పది మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 11వేల మంది విద్యార్థులు పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. కాగా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 60శాతానికి పైగా సిలబస్ పూర్తయ్యింది. డిసెంబర్ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేసేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. సిలబస్ పూర్తయిన వెంటనే జనవరి నుంచి రివిజన్ తరగతులు ప్రారంభించనున్నారు.
పదో తరగతి చదువుతున్న 11వేల మంది విద్యార్థులు ‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఈ నెల 9 నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగుతుల ద్వారా సబ్జెక్టులను బోధిస్తారు. కేజీవీబీల్లో ప్రత్యేకంగా నైట్ క్లాస్లు నిర్వహించనున్నారు. ప్రత్యేక తరగతులతోపాటు పరీక్షలకు సిద్ధం చేసేందుకు జనవరి నుంచి స్లిప్ టెస్టులు ప్రారంభించనున్నారు. ప్రతినెలా స్లిప్టెస్టులు నిర్వహించి విద్యార్థులు ఏ సబ్జెక్టులో మెరుగ్గా ఉన్నారు, ఏ సబ్టెక్టులో వెనకబడి ఉన్నారు పరిశీలించి వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించటంతోపాటు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేందుకు విద్యాశాఖ, ఉపాధ్యాయులు కలిసికట్టుగా ప్రణాళికాబద్ధంగా పనిచేయనున్నారు.
పదిలో వందశాతం ఫలితాలే మా లక్ష్యం. అందుకు అనుగుణంగా పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతున్నాం. ఈ నెల 9 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జనవరి నుంచి స్లిప్టెస్టులు నిర్వహింస్తాం. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. – నాంపల్లి రాజేశ్, డీఈవో, సంగారెడ్డి