సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 21: ప్రభుత్వం ఉపకార వేతనాల మంజూరుకు సిద్ధంగా ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్, రిజిస్ర్టేషన్లపై ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు కోసం విద్యార్థులతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లదే అని స్పష్టం చేశారు.
ఉపకార వేతనాలు ఇస్తామంటే విద్యార్థులు సంతోషంగా ముందుకు వస్తారన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రతివారం స్కాలర్షిప్స్ రావడం లేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అర్హులైన విద్యార్థులతో స్కాలర్షిప్ వైబ్సైట్లో దరఖాస్తు చేయించాలని, ప్రతిపాదనలు తయారు చేసి వారంలోగా సంబంధిత అధికారులకు పంపాలని సూచించారు. ఆయా సంక్షేమశాఖల అధికారులు వారి వసతి గృహ అధికారులను, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలతో సమన్వయం చేయాలన్నారు.
ఏఎస్డబ్ల్యూవోలు, హెచ్డబ్ల్యూవోలు నేరుగా వెళ్లి రెన్యూవల్, ఫ్రెష్ ప్రతిపాదనలను తీసుకోవాలని ఆదేశించారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యాశాఖ అధికారి పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా టీ వాలెట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్స్కు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, వివిధ సంక్షేమశాఖల అధికారులు జగదీశ్, ఫిరంగ్, డీఈవో రాజేశ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్రాం, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.