ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. మెదక్లో గతేడాది 9.01 మీటర్లు లోతులో నీరుండగా, ఈసారి 6.56 మీటర్లలో సరాసరి నీటిమట్టం ఉంది. 2.45 మీటర్ల పెరుగుదల ఉంది. 38శాతం అధిక వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే 30.30 మీటర్ల నీటిమట్టం ఉంటే, ఈసారి అక్టోబర్లో 27.42 మీటర్లలో చేరుకున్నాయి. దీంతో 1.73 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. 33.2 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా జలమే కనిపిస్తున్నది. యాసంగి సాగుకు ఢోకా లేదని రైతులు సంబురపడుతున్నారు.
– మెదక్/ సంగారెడ్డి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పారుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు పైపైకి వచ్చాయి. జిల్లాలో ఎక్కడ చూసినా నీటి వనరులు దర్శనమిస్తుండడంతో ఈ ఏడు రెండు పంటలు పండుతాయని రైతులు సంబుపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో భూగర్భజల మట్టాలు సెప్టెంబర్ మాసంతో పోలిస్తే అక్టోబర్లో 0.87 సెం.మీటర్ల మేర పైకి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 1.73 మీటర్ల మేర భూగర్బజలాలు పెరిగాయి. అక్టోబర్లో సాధారణ వర్షాల కంటే 33.2 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఇటీవల కురిసన వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. గత నెల కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో దిగువకు జలాలు వదిలారు. జిల్లాలోని నారింజ, నల్లవాగు ప్రాజెక్టుల్లో సైతం జలాలు నిండుగా ఉన్నాయి. చెరువులు, కుంటలు నీటితో జలకళను సంతరించుకున్నాయి. గతేడాది పోలిస్తే ఈ ప్రస్తుతం భూగర్భజలాలు ఉబికి పైకి వస్తున్నాయి. గత అక్టోబర్లో 30.30 మీటర్లలో భూగర్భ నీటిమట్టం ఉండగా, ఈ ఏడాది అక్టోబర్లో 27.42 మీటర్లకు చేరుకున్నాయి. 1.73 మీటర్లు పెరిగాయి. సెప్టెంబర్తో పోల్చిచూసినా అక్టోబర్లో 0.87 మీటర్ల మేర భూగర్భజలాలు పైకి వచ్చాయి.
అమీన్పూర్ మండలంలో అతితక్కువ లోతులో..
సంగారెడ్డి జిల్లాలో భూగర్భజల మట్టాలు పెరుగుతున్నాయి. వట్పల్లి, జహీరాబాద్ ప్రాంతాల్లో బోరుబావుల్లో నీరు పైకి ఉబికి వస్తున్నది. జిల్లాలో సాధారణ స్థాయిలో 7.10 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి. జిల్లాలో అత్యంత తక్కువ లోతులో అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్లో 0.54 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. వట్పల్లి మండలంలో 1.18 మీటర్లు, నాగల్గిద్దలో 1.69, రాయికోడ్ మండలంలో 2.03, ఝరాసంగంలో 2.05, మనూరులో 2.71, పుల్కల్లో 2.72 మీటర్లలో భూగర్భ జలమట్టాలు ఉన్నాయి.
జిన్నారం మండలంలో 3.13 మీటర్లు, మొగుడంపల్లి మండలంలో 3.17, మునిపల్లిలో 4.12, కందిలో 5.42, అందోలులో 5.64, సిర్గాపూర్లో 6.86, చౌటకూరులో 7.31, న్యాల్కల్లో 7.74, కోహీర్లో 8.63, సదాశివపేటలో 8.66, కంగ్టిలో 8.94, గుమ్మడిదలలో 8.82, పటాన్చెరు మండలంలో 10.06 మీటర్లు, జహీరాబాద్లో 11.26, రామచంద్రాపురంలో 11.29, సంగారెడ్డిలో 13.54 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలో అత్యంత ఎక్కువ లోతులో హత్నూర మండలంలో 14.24 మీటర్లలోతున భూగర్భ జలమట్టాలు ఉన్నాయి.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వాగులు వంకల్లో గంగమ్మ పరుగులు పెట్టింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో సింగూరు, వనదుర్గా(ఘనపూర్), మంజీరా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో రెండు జిల్లాల్లోనూ భూగర్భ జలాలు పెరిగియి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భంలో నీటిమట్టం పెరగడంతో అన్నదాతలు సాగు విస్తీర్ణాన్ని పెంచారు. బోరుబావుల్లో నీరు పైపైకి వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి/ మెదక్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
పాతాళగంగ
మెదక్ జిల్లాలో..
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు పెద్దఎత్తున పెరిగాయి. అక్టోబర్ 2021లో 9.01 మీటర్లు లోతులో ఉండగా, అక్టోబర్ 2022లో 6.56 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. 2.45 మీటర్ల నీటిమట్టం పెరిగింది. ఈ ఏడాది జిల్లాలో మే 2022లో 15.37 మీటర్లు ఉండగా, అక్టోబర్ 2022లో 6.56 మీటర్లు ఉంది. దీంతో 8.81 మీటర్ల నీటి మట్టం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ లోతులో సరాసరి నీటిమట్టం చిన్నశంకరంపేట మండలంలో 16.95 మీటర్ల నమోదైంది. తక్కువ లోతులో నీటిమట్టం శివ్వంపేట మండలం సికింద్లాపూర్ ఫీజోమీటర్లో నమోదైంది.
10 మీటర్ల నుంచి 20 మీటర్ల లోతులో సరాసరి నీటిమట్టం నమోదైన మండలాలు చిలిపిచేడ్, కౌడిపల్లి, అల్లాదుర్గం, నార్సింగి కాగా, మిగతావి 10 మీటర్లలోపు సరాసరి నీటి మట్టం నమోదైన మండలాలు పాపన్నపేట, చేగుంట, మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రేగోడ్, హవేళీఘనపూర్, చిన్నశంకరంపేట, మనోహరాబాద్, నిజాంపేట, రామాయంపేట, శివ్వంపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట మండలాలున్నాయి. సాధారణ వర్షపాతం 826.1 మి.మీ కాగా, 1141.3 మి.మీ వర్షపాతం నమోదైంది. 38 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
సాగుకు మరింత ఉపయోగకరం..
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పెరిగిన భూగర్భ నీటి మట్టంతో వ్యవసాయ బోర్లు, బావుల పరిధిలో సాగుకు మరింత ఉపయోగకరంగా మారింది. వ్యవసాయ బావుల వద్ద కూరగాయలు, పండ్ల తోటలు, వరి, ఇతర పంటలను రైతులు సాగు చేసే అవకాశం కలిగింది. గత వానకాలం సీజన్లో కంటే యాసంగి పంటలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రెండు జిల్లాల్లోనూ సాగు విస్తీర్ణం మరింత పెరుగనున్నది.
బోరుబావుల్లో పుష్కలంగా నీరు..
భారీ వర్షాలు కురవడంతో బోరుబావులు, వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నీటి మట్టం పెరిగింది. జిల్లాలో 10 నుంచి 20 మీటర్లలోపు 4 మండలాలు నమోదు కాగా, 10 మీటర్లలోపు 17 మండలాలు నమోదయ్యాయి. 38 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
– కె.వెంకటేశ్వర్రావు, మెదక్ జిల్లా భూగర్భజల శాఖ అధికారి