సంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ప్రభుత్వ మెడికల్ కళాశాల మరికొద్ది గంటల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వైద్య కళాశాల మంజూరు చేసి, 35 ఎకరాల స్థలం, రూ.510 కోట్లు కేటాయించారు. మొదటి విడుతలో భాగంగా రూ.30 కోట్లతో మూడంతస్తుల్లో ‘ఏ’ బ్లాక్ ను ప్రభుత్వం నిర్మించింది. నేడు నగరంలోని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆన్లైన్ ద్వారా మెడికల్ కాలేజీతో పాటు మొదటి బ్యాచ్ తరగతులను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతాప్రభాకర్ పరిశీలించారు. ఇప్పటికే వంద మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోగా, 26 మంది ప్రొఫెసర్లు, 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 61 మంది ఇతర బోధనా సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.
సంగారెడ్డి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంగారెడ్డి ప్రజల చిరకాల కల. ఏండ్ల తరబడి మెడికల్ కాలేజీ కోసం జిల్లా ప్రజలు ఎదురుచూశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంశం ప్రచార అస్త్రం అయ్యిందే తప్ప అది సాకారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల చిరకాల కలను నెరవేర్చారు. 2018 ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సంగారెడ్డి మెడికల్కాలేజీలో 2022-23 మొదటి ఎంబీబీఎస్ బ్యాచ్ ప్రారంభం కానున్నది. మంగళవారం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు మొదలుపెట్టనున్నారు.
సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభానికి సిద్ధం
సంగారెడ్డి మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ తరగుతులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి బ్యాచ్ విద్యార్థుల కోసం కళాశాలలో తరగతి గదులు, ల్యాబ్రూమ్లు, డేమో ల్యాబ్లు నాలుగు, ఈ లైబ్రరీ, రీడింగ్ రూములు, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లు సిద్ధం చేశారు. అనాటమీ మ్యూజియం, డిటెక్షన్హాల్, 20 ఫ్యా కల్టీ గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, డిపార్టుమెంట్ గదులు సిద్ధమయ్యాయి. ఎంబీబీఎస్ విద్యార్థులకు బోధన చేసేందుకు వీలుగా దవాఖానను సిద్ధం చేశారు. 450 పడకల బోధనా ద వాఖాన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్న ది.
బోధన చేసేందుకు సిబ్బంది నియామకాలు పూర్తయ్యా యి. ఇందులో 26 మంది ప్రొఫెసర్లు, 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 61 మంది ఇతర బోధనా సిబ్బందిని నియమించారు. మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం తాత్కాలికంగా హాస్టల్లను సిద్ధం చేశారు. బాయ్స్ కోసం సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్లో హాస్టల్ను ఏర్పాటు చేశారు. మహిళా ప్రాంగణంలో గర్ల్స్ హాస్టల్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీని మంజూరు చేశారు. 100 సీట్లతో త్వరలోనే నర్సింగ్ కాలేజీ సంగారెడ్డిలో ఏర్పాటు కానున్నది.
నేటి నుంచి తరగతులు ప్రారంభం
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొదటి సంవత్సరం తరగతులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయా ఏర్పాట్లను అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతాప్రభాకర్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వంద మంది విద్యార్థులతోపాటు వారితల్లిదండ్రులు పాల్గొనున్నారు. కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనున్నారు.
అధునాతన సేవలు అందుబాటులోకి..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మెరుగైన వైద్య విద్య, అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిధిలోని గవర్నమెంట్ జనరల్ దవాఖానకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా రోగులు చికిత్స కోసం వస్తారు. ప్రతిరోజు 1500 నుంచి 2వేల మంది ఔట్ పేషెంట్స్కు వైద్యులు సేవలు అందజేస్తారు. ప్రస్తుతం వైద్య కళాశాల ఏర్పాటుతో అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సర్జన్లు ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు అందజేస్తున్నారు. దీంతో గతంలో కంటే అదనంగా 20 రకాల కొత్త వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభం కానుండంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, చొరవ తీసుకున్న ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తరగతులు ప్రారంభం
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏకకాలంలో ఆన్లైన్లో తరగతులు ప్రారంభిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ ఆన్లైన్లో తరగతులను ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ చలవతో మెడికల్ కాలేజీ
సంగారెడ్డి ప్రజల చిరకాల కల అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఈ విషయంపై 2014లో అసెంబ్లీ వేదికగా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న చింతా ప్రభాకర్ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిందిగా సీఎంను కోరిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయటంలో తాత్సారం చేస్తూ వచ్చింది. కాగా, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని 2018లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ జూన్ 2021లో సంగారెడ్డికి మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన సమీపంలో 35 ఎకరాల స్థలం కేటాయించి, రూ.510 కోట్ల నిధులు మంజూరు చేశారు.
మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో రూ.30 కోట్లతో కళాశాల భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేశారు. కాగా, సంగారెడ్డి ప్రభుత్వ కళాశాల అనుమతులు మంజూరు చేసేందుకు ఫిబ్రవరి, మే మాసాల్లో జాతీయ వైద్య కమిషన్ సభ్యులు కళాశాలను సందర్శించారు. ఆగస్టు 22న జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సంగారెడ్డి మెడికల్ కాలేజీకి అనుమతులు జారీ చేసి, 150 సీట్లను కేటాయించింది. ఎన్ఎంసీ సీట్ల కేటాయింపు పూర్తికావటంతో సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల చేరికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు వంద మంది విద్యార్థులు మెడికల్ కాలేజీలో చేరారు. మంగళవారం నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తొలి బ్యాచ్ తరగతులు ప్రారంభంకానున్నాయి.
రూ.510 కోట్లతో నిర్మాణం..
రాష్ట్ర ప్రభుత్వం రూ.510 కోట్లతో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. అలాగే సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానను మెడికల్ కాలేజీకి అనుబంధ బోధన దవాఖానగా మార్చింది. 450 పడకల సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ప్రస్తుతం గవర్నమెంట్ జనరల్ దవాఖానగా మారింది. మెడికల్ కాలేజీ సూపరింటిండెంట్ పర్యవేక్షణలో జీజీహెచ్ ప్రస్తుతం పనిచేస్తుంది. 35 ఎకరాల విస్తీర్ణంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భవనాలు నిర్మిస్తున్నారు. మొదటి విడత నిర్మాణం పనులు పూర్తయ్యాయి. రూ.30 కోట్లతో ఏ బ్లాక్ నిర్మాణం పనులు పూర్తవగా, అందులో మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించేందుకు వీలుగా 88,752 చదరగు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో ఏ బ్లాక్ పనులు పూర్తి చేశారు. ఈ భవనంలో డిపార్టుమెంట్ అనాటమీ, డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజియాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, సెంట్రల్ లైబ్రరీ, తరగతి గదులు, మీటింగ్హాళ్లు, క్యాంటీన్ ఉన్నాయి. రూ.143 కోట్లతో బీ బ్లాక్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.
ఈ భవనం 81,536 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇందులో డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్, డిపార్టుమెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ పాథాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాంకాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ఉంటాయి. ఇవే కాకుండా 1,17,317 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తులతో గర్ల్స్ హాస్టల్ను నిర్మిస్తున్నారు. గర్ల్స్ హాస్టల్లో 256 గదులు నిర్మిస్తున్నారు. 82,646 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులు, 170 గదులతో బాయ్స్ హాస్టల్ను నిర్మిస్తున్నారు. 13,067 చదరపు అడుగుల విస్తీర్ణంలో 16 గెస్టు రూమ్లు, 9,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో కిచెన్, డైనింగ్హాల్ నిర్మిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
సంగారెడ్డి మెడికల్ కాలేజీ తరగతుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లతో తొలి బ్యాచ్ 2022-23 ప్రారంభం కానున్నది. ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు చేరారు. ఇంకా మెడికల్ కౌన్సిలింగ్ కొనసాగుతున్నది. మెడికల్ కాలేజీలో ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం కళాశాల భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటంజరిగింది.
– డా.వాణి, ప్రిన్సిపాల్
సీఎం కేసీఆర్ వల్లే మెడికల్ కాలేజీ
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అన్నది జిల్లా ప్రజల చిరకాల కల. సీఎం కేసీఆర్ వల్లే సంగారెడ్డిలో ప్రభు త్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సాధ్యమైంది. ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులు ప్రారంభించనున్నారు. ఇది జిల్లా ప్రజలకు పండుగ రోజు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎంకేసీఆర్కు సహకరించిన ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు.
– చింతా ప్రభాకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే