పాపన్నపేట, ఫిబ్రవరి 28: మహాశివరాత్రిని పురస్కరించుకొని తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో జరిగే జన జాతర నేటి నుంచి ప్రారంభంకానున్నది. ఈ మహాజాతరకు వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారని దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచానా. ఏర్పాట్లపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.
మూడు రోజుల పండుగ..
మహాశివరాత్రి పురస్కరించుకుని మూడు రోజులపాటు ఏడుపాయల్లో జాతర జరుగనున్నది. మొదటిరోజు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి ఉపవాస దీక్షలు చేపడతారు. అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి పండ్లు ఫలాలతో ఉపవాస దీక్షను విరమిస్తారు. రెండోరోజు బండ్లు తిరిగే కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈరోజు భక్తులు మాంసాహార విందుకు ప్రాధాన్యతనిస్తారు. కార్యక్రమంలో మండలంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 110 బండ్ల వరకు తిరుగుతాయి. అనాధిగా వస్తున్న ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు తిరుగగా మిగతా బండ్లు దీనిని అనుసరిస్తాయి. మూడురోజు రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఏడుపాయలోని రథం గోలి నుంచి రథాన్ని లాగే కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ఏడుపాయల జాతర ముగుస్తుంది.
జాతరకు వచ్చే ‘మార్గాలు’..
పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి పంచాయతీ పరిధిలోని ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం హైదరాబాద్ నుంచి 119 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మవారి దర్శనానికి ఆర్టీసీ వారు సుమారు 200 బస్సులను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు నర్సాపూర్ మీదుగా పోతంశెట్టిపల్లి వైపు నుంచి నేరుగా ఏడుపాయల జాతరకు వెళ్లొచ్చు.
నారాయణఖేడ్, జహీరాబాద్ నుంచి ఏడుపాయలకు వచ్చే భక్తులు బొడ్మట్పల్లి మీదుగా నాగ్సాన్పల్లి వైపు నుంచి ఏడుపాయలకు చేరుకోవచ్చు.
సంగారెడ్డి, జోగిపేట వైపు నుంచి వచ్చే భక్తులు నాగ్సాన్పల్లి, పోతంశెట్టిపల్లి రెండు వైపుల నుంచి వెళ్లవచ్చు.
నిజామాబాద్, రామాయంపేట వైపు నుంచి వచ్చే భక్తులు నాగ్సాన్పల్లి, పోతంశెట్టిపల్లి రెండు వైపుల నుంచి వెళ్లవచ్చు.
అమ్మవారి దర్శనం ఇలా…
వనదుర్గాభవానీ మాతను దర్శించుకోవడానికి ధర్మదర్శనానికి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. వీఐపీ దర్శనానికి వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనానికి రూ.20, కొబ్బరికాయలు రూ.30, ఒడిబియ్యం సమర్పించడానికి రూ.50, కేశఖండనకు రూ.50, లడ్డు రూ.20, పులిహోర రూ.10గా నిర్ణయించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఏడుపాయల జాతరకు హాజరయ్యే, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. స్నానాల కోసం వనదుర్గా ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో పాటు భక్తుల స్నానాల కోసం షవర్బాత్లు ఏర్పాటు చేశాం. పెద్దఎత్తున తాత్కాలిక టాయిలెట్లు, తాగునీటి వసతితో పాటు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రైవేటు వాహనాలపై వచ్చే భక్తుల కోసం నాగ్సాన్పల్లి, పోతంశెట్టిపల్లి వైపు పార్కింగ్ సౌకర్యం కల్పించాం.
– ఆలయ ఈవో సారశ్రీనివాస్