కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమానో.. లేక అన్ని రాష్ర్టాల్లో తామే అధికారంలోకి రావాలనే ఆశనో ఏమో కానీ కమలం పార్టీ అత్యాశకు పోయి అక్రమ మార్గాల్లో పయనిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇదే ఆలోచనతో నలుగురు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరపడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీఆర్ఎస్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ కుట్రలను ఎండగడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, బీజేపీ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. ఈ కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలను తెలంగాణ సమాజం సహించదని పేర్కొన్నారు.
సిద్దిపేట, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సంగారెడ్డి/మెదక్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): : టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు బయటపడుతుండడంతో గులాబీ శ్రేణులు భగ్గుమంటున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన బేరసారాల ఘటనపై టీఆర్ఎస్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ కుట్రలను ఎండగడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొన్నిచోట్ల ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా బీజేపీ తీరును దుయ్యబట్టారు. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా నిరసనలు మిన్నంటాయి. ఖబడ్ద్దార్ మోదీ, అమిత్షా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నో త్యాగాలు, మరెన్నో పోరాటాలు సాగించి సాధించిన తెలంగాణ రాష్ట్రం ఎవరికి తలొగ్గదన్నారు. ఈ సందర్భంగా ఆయా నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధ్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించడాన్ని ఖండించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. దీనిని చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు ఎలాగైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.బీజేపీ చేసే కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆర్థ్ధికంగా ఇబ్బందులు పెడుతున్నదని, అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ను చూసి బీజేపీ అగ్ర నాయకత్వానికి వణుకు పుట్టిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మనకు ముప్పుగా మారుతుందని నమ్మి కేంద్రంలోని బీజేపీ నాయకులు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దీనిని యావత్తు ప్రజానీకం ఛీకొడుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కుట్రలకు తెరలేపారని, దీనిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన, పోరాటాల గడ్డ అని, ఇలాంటి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధైర్యంతో బీజేపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూల్చుతున్నదని ఆరోపించారు. ఇలాంటి వాటిని తెలంగాణ సమాజం సహించదని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో..
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ, అమిత్షా, బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నిన బీజేపీ నాయకులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిన టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఆండ్బీ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు మోదీ దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదీ, అమిత్షా, బీజేపీల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ జిందాబాద్, మోదీ డౌన్డౌన్, దేశ్కి నేతా కైసా హో..కేసీఆర్ జైసా హో.. అంటూ నినాదాలు చేశారు. అసలైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హిందుత్వానికి మచ్చ తెచ్చారు
ప్రజాస్వామ్యాన్ని బేరం పెట్టడం, అందులో స్వామీజీలు, పీఠాధిపతులను వాడుకుని బీజేపీ హిందుత్వానికి మచ్చ తెచ్చింది. ఎక్కడో ఢిల్లీలో ఉండే పీఠాధిపతులను తమ రాజకీయ స్వార్థానికి వాడుకోవడం సహించరానిది. ప్రజాస్వామ్యాన్ని మలినం చేసిన బీజేపీ నాయకులు రాక్షసులకన్నా దుర్మార్గులు. ప్రజలంతా వీరి నుంచి జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్ యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ
ఎమ్మెల్యేల కొనుగోలు .. మోదీ దుర్మార్గపు చర్య
ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ గడ్డపై ఎమ్మెల్యేల బేరసారాలు మోదీ దిగజారుడి రాజకీయానికి నిదర్శనం. మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాని చిల్లర రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఇతర రాష్ర్టాల్లో మాదిరి ఎమ్మెల్యేలను కొని, అధికారం దక్కించుకునేందు కు మోదీ సర్కార్ ఎన్నో జిమ్మిక్కులు చేసింది. అదేమాదిరిగా తెలంగాణలో చేసేందుకు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణ ఉద్యమ గడ్డ. ఇక్క డ అమ్ముడు పోయే నాయకులు ఉండరు. అలాంటి వారి ని తెలంగాణ ప్రజలు సహించబోరు. తెలంగాణ అంటే కేసీఆర్. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు.
– కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
అప్రజాస్వామిక సంస్కృతికి తెరలేపిన బీజేపీ ప్రభుత్వం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అప్రజాస్వామిక సంస్కృతికి తెరలేపిన ఢిల్లీ బీజేపీ పెద్దల దుష్ట నీతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు పాల్పడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలి. అక్రమ పద్ధతుల్లో టీఆర్ఎస్ సర్కార్ను బీజేపీ కూల్చాలని ప్రయత్నిస్తున్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నిం చడాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో నిరసన తెలిపి, బీజేపీ, మోదీ, అమిత్షాల దిష్టిబొమ్మలను దహనం చేశాం.
– పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు
బీజేపీ కుట్రలను ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారు..
బీజేపీ చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారెవరూ అమ్ముడుపోరు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాం టి కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నది. బీజేపీని తెలంగాణ నుంచి తరమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మునుగోడులో బీఆర్ఎస్కు ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి ఓటమి తప్పదు. సీఎం కేసీఆర్కు దేశ రాజకీయాల్లో వస్తున్న ఆదరణను చూసి బీజేపీ, కేంద్ర పెద్దలు తట్టుకోలేకనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. వారిని కుట్రలను తరిమికొడతాం.
– ఎం.శివకుమార్, ఉమ్మడి మెదక్ డీసీఎంఎస్ చైర్మన్
ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి ఖాయమనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్రలు చేస్తున్నారు. బీజేపీని ఎదిరించే దమ్ము సీఎం కేసీఆర్ ఉంది. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ బలపడుతున్నదనే భయంతో నే ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే దేశ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నది. సీఎం కేసీఆర్కు వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ నాయకులు తెలంగాణలో కుట్రలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూలదోసినట్టు తెలంగాణలో చేస్తామంటే వారి ఆటలు ఇక్కడ సాగవు. ఇక్కడ అమ్ముడు పోయేవాళ్లు ఉండరు. మునుగోడు ఉప ఎన్నికతో బీజేపీ పని తెలంగాణలో ముగుస్తుంది.
– కొనింటి మాణిక్రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే
ప్రజా స్వామ్యాన్నిఖూనీ చేస్తున్న బీజేపీ
దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీచేస్తున్నది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను కూలగొట్టడమే ఎజెండగా బీజేపీ పనిచేస్తున్నది. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనది. బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే కుట్ర పన్నింది. వారి కుట్రలు సీఎం కేసీఆర్ ముందు సాగవు. తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మరు. యావత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నది. బీజేపీ పన్నుతున్న కుట్రలను టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు గమనించాలి. వారి చర్యలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు గా ఉన్నందున్న ఎక్కడికక్కడా వారిని అడ్డుకోవాలి. తగిన గుణపాఠం చెప్పాలి.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ప్రభుత్వ విచ్ఛిన్నానికి కుట్ర
టీఆర్ఎస్ను ఎదుర్కోలేక బీజేపీ మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర భగ్నమైంది. ఇతర రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తరహాలోనే ఇక్కడా ప్రయత్నించినప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధత గల మా ఎమ్మెల్యేలు బీజేపీ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా గుట్టురట్టు చేయడం అభినందనీయం. సీఎం కేసీఆర్ ఉండగా టీఆర్ఎస్కు, మా ప్రభుత్వానికి బీజేపీ ఏమీ చేయలేదనేది ఈ ఘటనతో రుజువైంది. దొంగచాటున ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీ నేతల నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మునుగోడు ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయం. – మహారెడ్డి భూపాల్రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే
బీజేపీకి భంగపాటు తప్పదు
దేశంలో ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూ ల్చి, ప్రజల్లో చీలికలు తీసుకొస్తున్న బీజేపీ కి భంగపాటు తప్పదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు. అన్ని రాష్ర్టా ల్లో కుట్రలతో విజయవంతమైన బీజేపీ తెలంగాణలో సీఎం కేసీఆర్ దెబ్బ తో విలవిలలాడింది. సీఎం కేసీఆర్ రివర్స్ పంచ్తో సాధ్యపడలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నం వికటించిం ది. ఈ ప్రభావం మునుగోడు ఉప ఎన్నికపై కచ్చితంగా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రతిపక్షాలు, మేధావులు బీజేపీ తీరును ఎండగడుతున్నారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్కు అండగా ఉంటారు.
– ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్సీ
బీజేపీకి టీడీపీ గతి ఖాయం
మహోన్నత వ్యక్తి పాలనలో కొనసాగుతున్న తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక మోదీ, షాలు ప్రభుత్వాన్ని పడగొట్టేందు కు కుట్రలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పథకం రచించి తెలంగాణ ప్రజల ముందు బీజేపీ బొక్కబోర్లా పడింది. మునుగోడులో ఓటమి ఖాయమని తెలిసిన ఢిల్లీ పెద్దలు టీఆర్ఎస్, తెలంగాణ సర్కార్ను కూల్చేయాలనే క్షక్షగట్టి మా ఎమ్మెల్యేలను కొనేందుకు వారి దూతలను పంపించి అడ్డంగా దొరికిపోయారు. గతంలో ఎమ్మెల్సీని కొనుగోలు చేసే క్రమంలో రేవంత్రెడ్డిని పంపించి తెలంగాణలో కనుమరుగైన టీడీపీ గతే బీజేపీకి పడుతుంది.
– ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే
బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. దేశంలోని పార్టీలను నిర్వీర్యం చేసి తమ పెత్తనం పెంచుకునేందుకు బీజేపీ చేస్తున్న కుతంత్రాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు, పదవులు ఆశ చూపేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. వారికి తగిన గుణపాఠం చెప్పాలి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. బీజేపీలాంటి పార్టీల కుట్రలు ఇక్కడ సాగవు.
– వొడితెల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
ఈడీలు, స్వామీజీలను సైతం వాడుకుంటున్న బీజేపీ
ఈడీలు, ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్తో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఇప్పుడు స్వామీజీలు, పూజారులను కూడా వదలడం లేదు. బీజేపీకి అభివృద్ధి పట్టదు. ప్రజల అవసరాలు, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో బీజేపీ నేతలకు తెలియదు. తెలిసింది ఒక్కటే నయానా, భయానా లొంగ దీసుకోవడం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ చేసిన కుట్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయట పెట్టారు. బీఆర్ఎస్ ఎదగకుండా అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న కుట్రను తిప్పికొట్టే సామర్థ్యం టీఆర్ఎస్కు ఉంది.
– గూడెం మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే