సంగారెడ్డి, అక్టోబర్ 27: ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆహర్నిశలు విధులు నిర్వహించేది పోలీసులేనని, ప్రజలను రక్షించడం పోలీసుల ముందున్న కర్తవ్యమని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా స్థానిక ప్రభుత్వ అతిథిగృహం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండాఊపి ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు శాంతిభద్రతల విషయంలో పోలీసులు రక్షణగా విధులు నిర్వహిస్తారని, వివిధ కారణాలతో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం కనీస బాధ్యత అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు పోలీసులు ముందుండాలని కోరారు. ఈ సైకిల్ ర్యాలీలో జిల్లా పోలీసులు, అధికారులు, ప్రజలు, పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, భారీసంఖ్యలో పాల్గొని సైకిల్ ర్యాలీని విజయవంతం చేశారని ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, డీఎస్పీ రవీంద్రారెడ్డి, రూరల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్బీ ఇన్స్పెక్టర్ మహేశ్గౌడ్, ఆర్ఐలు కృష్ణ, డానియల్, ఎస్బీ ఎస్సై యాదవరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.