ఒకప్పుడు బతుకుదెరువు కోసం మెతుకు సీమ ప్రజలు పొట్టచేతబట్టుకుని భీవండి.. ముంబయి.. షోలాపూర్.. హైదరాబాద్ తదితర పట్టణాలకు వలస వెళ్లారు. సాగునీరు లేక, చేతినిండా పనిలేక, కుటుంబ పోషణ ఎలా..? పిల్లల భవిష్యత్తు ఏమిటీ..? లాంటి ఆలోచనలతో వందలాది కుటుంబాలు తలోదిక్కు వెళ్లాయి. కానీ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో నాటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేడు గ్రామాల్లో ప్రగతి పరుగులు తీస్తుండడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రజలు మళ్లీ సొంతూళ్లకు తిరుగు పయనమవుతున్నారు. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న గోదారమ్మను ఉమ్మడి మెదక్ జిల్లాకు తెచ్చి నెర్రెలు వారిన, బీడు భూముల్లో గోదావరి జలాలు పారించడంతో బంగారు పంటలు పండుతున్నాయి. ఎక్కడెక్కడికో వలస పోయిన వారంతా మూడు నాలుగేండ్ల నుంచి తిరిగి తమ సొంత ఊళ్లకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టాల నుంచి పనుల కోసం కూలీలు మన వద్దకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పల్లెలు పచ్చని వాతావరణంలో ఉట్టిపడుతున్నాయి.
సిద్దిపేట, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వలస పోయిన వారంతా మూడు, నాలుగేండ్ల నుంచి తిరిగి తమ సొంత ఊర్లకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత పని దొరుకుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పల్లెలు పచ్చని వాతావరణంలో ఉట్టిపడుతున్నాయి. సాగునీరు అందుబాటులోకి రావడం, ఉచిత కరెంట్ సరఫరా, రైతుబంధుతో పాటు ప్రభుత్వ చేయూతతో గుంటజాగ లేకుండా పంటలు సాగవుతున్నాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అన్నదాతలు గట్టు మీద కూర్చుండి సద్దన్నం తింటూ ఎవుసం చేస్తుండ్రు.
ఏ కారుకు ఆ కారు (కాలం) సాగు విస్తీర్ణం పెరిగిపోతున్నది. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. పండించిన పంటనంతా మద్దతు ధరకు రైతుల ముంగిటనే కొంటున్నది టీఆర్ఎస్ సర్కారు. రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులను జమ చేస్తున్నది. దీంతో దళారుల పీడ విరగడైంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టాల నుంచి పనుల కోసం కూలీలు మన వద్దకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు పనులు లేక వలస పోయిన మెతుకుసీమలో, ఇప్పుడు ఎక్కడెక్కడి రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి ఉపాధి చూపుతున్నాం. వరినాట్లు మొదలుకొని కోతల వరకు ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు. జీవాలతో వచ్చి వాటిని మేపుతూ పెంపకందారులు ఉపాధి పొందుతున్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి వరికోత యంత్రాలు వారు బతుకుతున్నారు. మెతుకు సీమ అనేక రాష్ర్టాల వారిని అక్కున చేర్చుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి గొర్రె మేకలతో పెంపకందారులు వచ్చి మేపుతున్నారు. చెప్పుకుంటూ పోతుంటే పల్లె వాతావరణం పూర్తిగా మారింది. చెరువులు నిండడంతో పాటు రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి.ఎవుసం పనులు జోరు మీద ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో కార్మికులకు పని మస్తుగా లభిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో పల్లె జీవన వ్యవస్థ పూర్తిగా మారింది. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు దర్శనమిస్తున్నాయి. చేతినిండా పని ఉండడంతో సంబురంగా ఎవుసం పనులు కొనసాగుతున్నాయి.
నాడు వలస బాట పట్టిన పల్లె ప్రజలు.. ఇవాళ సొంత ఊరిలోనే పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పట్టణాలకన్నా పల్లెల్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో ప్రజలకు చేతినిండా పని దొరుకుతున్నది. రోడ్లు బాగై రవాణా సౌకర్యం మెరుగపడడంతో పట్టణాలకు అరగంటలో చేరుకుంటున్నారు. దీంతో గ్రామాల్లోనే హైటెక్ హంగులతో ఇండ్లను కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. తమ వ్యవసాయ పొలాల్లో మంచి భవనాలను నిర్మించుకుంటున్నారు. ఇవన్నీంటికీ మారిన పరిస్థితులే కారణం అని చెప్పాలి. ఒకప్పుడు గ్రామాల్లో ఇండ్లకు తాళాలు ఉండేవి. కిరాయికి ఉందామంటే ఇల్లు దొరకని పరిస్థితి గ్రామాల్లో ఇప్పుడు ఉన్నది. ఒకప్పుడు ఇండ్లలో ఎవరూ ఉండక పడావు ఉండి కూలిపోయాయి. ఇవ్వాళ నెలకు వెయ్యి రూపాయల వరకు కిరాయి ఇస్తామన్న గ్రామాల్లో ఇల్లు దొరకని పరిస్థితి ఉంది. పట్నాల్లో ‘టూ లెట్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో పనులు దొరుకుతున్నాయి. హాయిగా ఉన్న ఊరిలోనే పని చేసుకుంటున్నారు. పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మంచి గిరాకీ పెరిగింది. ప్రధానంగా ట్రాక్టర్లకు ఫుల్ గిరాకీ ఉంది. వరికోత మిషన్లు, చైన్తో నడిచే వరికోత మిషన్లు ఇలా అన్ని రకాల మిషన్లకు గ్రామాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు పడావు భూములను సైతం కొత్తగా పొలాలు అచ్చుకట్టి సాగుచేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యల్లో ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండడంతో రైతులతో పాటు ట్రాక్టర్లు కొనుగోలు చేసిన యజమానులు, దానిపై పనిచేసే కార్మికులు, ట్రాక్టర్ గ్యారేజీలకు ఫుల్గా పని దొరుకుతున్నది.వ్యవసాయ బావుల మోటారు మరమ్మతులు చేసే దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఆయా గ్రామాల్లోని దుకాణాల్లో విద్యుత్ మోటార్లు మరమ్మతులు చేయించడంతో గిరాకీ పెరిగిందని మెకానిక్లు చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల్లో నూతనోత్తేజం వచ్చింది. సమైక్య రాష్ర్టంలో సాగునీరు లేక రైతులు అల్లాడిపోయారు. ఎక్కడో పుట్టిన గోదారమ్మను అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ మీదుగా ఎంతో ఎత్తులో ఉన్న కొండపోచమ్మ వద్దకు నీళ్లు తీసుకువచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను దేవుడంటున్నారు రైతులు. ఇన్నాళ్లు రైతుల కోసం ఎవరూ ఇంతలా ఆలోచించలేదు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తుండడంతో కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నిండి వాటి పరీవాహక ప్రాంతాల్లో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. చెంబుతో నీళ్లు ముంచుకునే రోజులు వచ్చాయి. ఇన్నాళ్లూ నీళ్లు లేక పడావున్న భూముల్లో రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. నల్లరేగడి, ఎర్రనేలలు మంచి సారవంతమైన భూములు కావడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా పరిస్థితులు మారాయి.
సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలోనే సాగునీటితో పాటు ఇతర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించింది. పల్లెల్లో పచ్చని వాతావరణం సాధ్యమైంది. అన్ని వర్గాల వారికి చేతినిండా పని దొరకుతున్నది. ఇవాళ ఇతర రాష్ర్టాలకు ఆతిథ్యం, ఆశ్రయమిస్తున్నది. ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి కూలీలు పెద్ద ఎత్తున వచ్చి పనులు చేసుకుంటున్నారు. నాట్ల నుంచి వరి కోతల వరకు అన్ని పనుల్లో ఉపాధి పొందుతున్నారు. రైస్మిల్లులు, ఇతర పరిశ్రమల్లో కూడా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలు ఉన్నారు. వరికోతలు ప్రారంభం కావడంతో ఇక్కడికి ఇతర రాష్ర్టాల నుంచి వరికోత మిషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడ ఉన్నవాటికి ఫుల్ గిరాకీ ఉండడంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన మిషన్లకు కూడా మంచి గిరాకీ లభిస్తున్నది. ఇటీవల మూగజీవాలు సైతం వస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి పెద్ద ఎత్తున జీవాలను మేతకు పాత మెదక్ జిల్లాకు తీసుకువస్తున్నారు. మంజీర ఒడ్డున జీవాలు మేస్తున్న దృశ్యాలు మనకు నిత్యం కనిపిస్తున్నాయి. ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి దృశ్యాలు చూస్తున్నాం.