సర్కారు బడులు ప్రగతిబాట పడుతున్నాయి.. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ‘మనఊరు-మనబడి’ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మరమ్మతులు, నూతన నిర్మాణాలు, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు విడతల వారీగా పాఠశాలలను ఎంపిక చేసి సకల వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటికే ఎంపిక చేసిన బడుల్లో ప్రారంభించిన పనులు వివిధ దశల్లో ఉండగా, పూర్తవుతున్న పనులతో ఆయా పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా సిద్ధమవుతున్నాయి.
తెలంగాణకు ముందు శిథిలావస్థకు చేరి.. అరకొర సౌకర్యాలతో దీనావస్థలో ఉన్న ప్రభుత్వ బడులకు టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రూ. వేల కోట్లు కేటాయిస్తుండడంతో పాఠశాలల రూపరేఖలు మారుతున్నాయి. విద్యాబోధన, మౌలిక వసతులు మెరుగుపడుతుండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మొదటి విడుత కింద 16 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేయగా, టాయిలెట్లు, సంపుల నిర్మాణం, విద్యుత్ మరమ్మతులు, తాగునీటి వసతి తదితర పనుల కోసం ప్రభుత్వం రూ.5 కోట్ల 40 లక్షలు మంజూరు చేసింది. ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభించగా, డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసేలా పాఠశాలల విద్యా కమిటీలు, సర్పంచ్లు చర్యలు తీసుకుంటున్నారు.
కొల్చారం, అక్టోబర్ 23: సకల సౌకర్యాలతో విద్యార్థులకు మె రుగైన విద్య అందేలా సర్కారు బడులు రూపుదిద్దుకుంటున్నా యి. ప్రభుత్వం పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మనఊరు-మనబడి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే నిధుల కేటాయింపు పూర్తికాగా, పనులు చేపట్టేందుకు రెండు ఇంజినీరింగ్శాఖలకు పనులను వి భజించారు. పాఠశాలల్లో అవసరమైన చోట అదనపు గదుల ని ర్మాణం, పాత భవనాలకు ప్లాస్టరింగ్, స్లాబ్ మరమ్మతులు, టాయిలెట్స్, ప్రహరీల నిర్మాణం, కరెంటు, తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇందుకు జాతీయ ఉపాధి హామీ నిధులు, విద్యాశాఖ నిధులను కలిపి మంజూరు చేశారు. ఎస్టిమేషన్లు రూ.30లక్షలకు దిగువన ఉంటే పాఠశాల విద్యా కమిటీ, రూ.30లక్షలకు పైగా ఉంటే టెండర్ ఆధారంగా పనులు నిర్వహిస్తున్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా 31 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత పాఠశాలలు, పది ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో 4,151 మంది విద్యార్థినీవిద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొదటి విడతలో ఏడు ప్రాథమిక పాఠశాలలు, రెండు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఏడు ఉన్నత పాఠశాలలు మొత్తం 16 పాఠశాలలు ‘మనఊరు-మనబడి’ కింద ఎంపికయ్యాయి.
ఈ పనులు చేపట్టేందుకు రూ.5,40,54,593 మంజూరయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి పనులు మండల వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో కరెంటు పనులు పూర్తి కాగా, మరిన్ని పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. మొదటగా ఎనగండ్ల, అంసాన్పల్లి పాఠశాలల్లో కరెంటు పనులు పూర్తయ్యాయి. కొల్చారంలోని పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణాలు సాగుతున్నాయి. పాత భవనాల ప్లాస్టరింగ్, మరమ్మతు పనులు సాగుతున్నాయి.
వరిగుంతం పాఠశాలలో సంపు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చిన్నాఘన్పూర్ పాఠశాల ఆవరణలో తాగునీటి పైప్లైన్ పనులు సాగుతున్నాయి. పైతర, కిష్టాపూర్లో కరెంటు సామగ్రి తీసుకొచ్చారు. డిసెంబర్ నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత పాఠశాల కమిటీలు, సర్పంచ్లు పనులు వేగవంతం చేస్తున్నారు.
ఇప్పటి దాక పాఠశాలకు ప్రహరీ లేక పశువులు, మేకలు వచ్చి మొక్కలను మేసేవి. మా పాఠశాలకు బడ్జెట్ వచ్చిందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఇప్పుడు సంపు నిర్మాణ పనులను ప్రారంభించాం. త్వరలోనే ప్రహరీ, కరెంటు పనులు చేయిస్తాం.
– కిష్టయ్య, వరిగుంతం పాఠశాల కమిటీ చైర్మన్
మొదటి విడతలో 16 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. కొన్ని పాఠశాలల్లో కరెంటు పనులు పూర్తి కాగా, టాయిలెట్ల నిర్మాణం, మరమ్మతులు సాగుతున్నవి. మరికొన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. నాణ్యతతో పాటు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా సూస్తాం.
– నీలకంఠం, మండల విద్యాధికారి, కొల్చారం