సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 22: జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీఎస్ఆర్ నిధుల పర్యవేక్షణా కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలను 5 క్లస్టర్లుగా చేశామన్నారు. ఆయా యాజమాన్యా లు కంపెనీ యాక్ట్ మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయాలన్నారు. సీఎస్ఆర్ నిధులను రాబట్టేందుకు సరైన పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ వారికి కేటాయించిన క్లస్టర్లోని పరిశ్రమలను పరిశీలించి నివేదిక అందజేయాలని సూచించారు.
కంపెనీ యాక్ట్ నిబంధనల మేరకు ఉన్నది, లేనిది క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలకు నోటీసులు జారీ చేయాలన్నా రు. ఆయా క్లస్టర్లలోని అన్ని పరిశ్రమలను మరోసారి తనిఖీ చేసి పూర్తి వివరాలతో నివేదిక అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, కమిటీల్లోని ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.