గజ్వేల్, ఫిబ్రవరి 20: కాయకల్ప అవార్డుకు గజ్వేల్ ఏరియా దవాఖాన మరోసారి సిద్ధమైంది. రాష్ట్రస్థాయిలో పరిశీలనకు ముందుగా నిర్వహించే థీర్ అసిస్మెంట్ సోమవారం నిర్వహించటానికి తాండూరు దవాఖాన వైద్యాధికారుల బృందం రానున్నది. కాయకల్ప అవార్డు పరిశీలన మొత్తం18 అంశాలపై కొనసాగనున్నది. ముఖ్యంగా నాణ్యతాప్రమాణాలు, వ్యాధి సంక్రమణ, నియంత్రణ, పారిశుధ్యం, పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు దవాఖానలో పరిశీలిస్తారు. దవాఖాన భవన నిర్మాణాలు, వస్తు సామగ్రి, పరికరాలు, యంత్రాలు, గార్డెన్ ఏరియా నిర్వహణను అధికారులు పరిశీలించనున్నారు. పారిశుధ్యం, పరిశుభ్రత, దవాఖాన నిర్వహణకు సరిపోయే నీటి వసతి, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, సర్జరీల్లో ఇన్ఫెక్షన్ ఎంతమందికి వచ్చింది అనే విషయాలను పరిశీలిస్తారు. ఆపరేషన్, లేబర్ రూం తదితర విభాగాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు, రోగి వివరాల సేకరణ, రికార్డుల నిర్వహణను అధికారుల బృందం పరిశీలించనున్నది. ఈకో ఫ్రెండ్లీలో భాగంగా దవాఖాన సిబ్బంది కోసం గ్రంథాలయం, క్రీడా వాతావరణం, యోగా, మెడిటేషన్, స్టాఫ్కు పిల్లలు ఉంటే పిల్లల సంరక్షణ గది, స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధిత చర్యలు, మొక్కల పెంపకం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కాయకల్ప అవార్డుకు ఎంపిక చేస్తారు.
గజ్వేల్ దవాఖానలో అన్ని సౌకర్యాలు, పటిష్ట చర్యలు
గజ్వేల్ ఏరియా దవాఖానకు కాయకల్ప అవార్డు పొందడానికి అన్ని విధాలా అర్హతలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో అద్భుతమైన భవన నిర్మాణం, బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్, అధునాతన ఆపరేషన్ థియేటర్లు వినియోగిస్తూ డాక్టర్లు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. అవసరమైన మేరకు డయాగ్నోస్టిక్, డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పిస్తున్నారు. దవాఖాన పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.
రెండుసార్లు గజ్వేల్ దవాఖానకు కాయకల్ప అవార్డు
గజ్వేల్ ఏరియా దవాఖాన నిర్వహణ, సేవల్లో దవాఖానకు రెండు సార్లు రాష్ట్రస్థాయిలో అవార్డులు లభించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అవార్డు కింద లక్ష నిధులు బహుమతిగా లభించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో రన్నరప్గా నిలిచింది. ఇందుకు రూ.10లక్షలు దవాఖాన అభివృద్ధికి బహుమతిగా లభించాయి.
ప్రస్తుతం థీర్ అసిస్మెంట్
ప్రస్తుతం థీర్ అసిస్మెంట్ నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ఇతర దవాఖాన అధికారులు గజ్వేల్ దవాఖానను పరిశీలించిన అనంతరం కాయకల్ప అవార్డుకు ఉన్న అర్హతలను లెక్కిస్తారు. తర్వాత కాయకల్ప రాష్ట్ర బృందం మార్చి నెలాఖరులోగా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానను పరిశీలించనున్నది.జాతీయస్థాయిలో నిధుల సమీకరణ కోసం గజ్వేల్ దవాఖాన పోటీలో ఉన్నది. జాతీయ స్థాయిలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం మరో నెలరోజుల్లో గజ్వేల్ దవాఖానను సందర్శించనున్నది.జాతీయ పరిశీలన బృందం14 విభాగాల్లో దవాఖానను పరిశీలిస్తారు. ప్రతి విభాగంలో 70శాతం పాయింట్లు లభిస్తే రూ.50లక్షలు బహుమతిగా దవాఖాన అభివృద్ధికి లభిస్తాయి. వీటిని ఐదేండ్లపాటు ఏడాదికి రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తారు.
– డాక్టర్ మహేశ్, దవాఖాన సూపరింటెండెంట్