జహీరాబాద్, అక్టోబర్ 10: తీపిని అందించే చెరుకు రైతుల బతుకు చేదెక్కింది. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు మద్దతు ధర పెంచకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొన్నది. చెరు కు పంటకు పెట్టుబడులు పెరిగినా, మద్దతు ధర పెంచకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. గతేడాది చెరుకు పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు కర్ణాటక, మహారాష్ర్టలకు చెరుకు సరఫరా చేశారు. గత సీజన్లో ఇచ్చిన మద్దతు ధర ఈ సీజన్లో ఇస్తే తమకు గిట్టుబాటు కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు పండిస్తున్న రైతులకు ఏండ్లుగా చేదు అనుభవమే మిగులుతోంది. పెట్టుబడులు పెరిగినంతగా మద్దతు ధర లభించడం లేదు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ (బి) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ చక్కెర కర్మాగారం యాజమాన్యం మద్దతు ధరను టన్నుకు రూ. 3269 ప్రకటించింది. ఈ ధర గిట్టుబాటు కాదని రైతులు తెలుపుతున్నారు. పెరిగిన ఎరువులు, కూలీ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు. జహీరాబాద్ ట్రైడెంట్ చక్కర కర్మాగారం పరిధిలో జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, కోహీర్, రాయికోడ్, మొగుడంపల్లి మండలాలు ఉన్నాయి.
జహీరాబాద్లో అధికంగా చెరుకు సాగు
జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో 11వేల హెక్టార్లలో చెరుకు పంటను రైతులు సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సంగారెడ్డి గణపతి చక్కెరా పరిశ్రమ పరిధిలో 5.5వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అధికంగా జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, ఝరాసంగం, కోహీర్, రాయికోడ్ మండలాల్లో సాగు చేస్తున్నారు. అగ్రిమెంట్, నాన్ అగ్రిమెంట్ చెరుకు సాగులో ఉంది. కొందరు రైతులు ఫ్యాక్టరీలతో అగ్రిమెంట్ చేసుకోరు. క్రషింగ్ సీజన్లో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే ఆ పరిశ్రమకు చెరుకును తరలిస్తారు. ఒక ఎకరా చెరుకును సాగు చేయాలంటే రూ. 45వేలు ఖర్చు వస్తుంది. డీఏపీ, యూరియా ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పాటు కూలీ ఖర్చులు సైతం అధికమయ్యాయి. పెట్టుబడి, ఖర్చులు పెరిగినా మద్దతు ధర పెంచడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ట్రైడెంట్ ఫ్యాక్టరీ రైతులకు టన్నుకు రూ. 3050 ధర చెల్లిస్తే కర్ణాటక, మహారాష్ర్టల్లో ఫ్యాక్టరీలు టన్నుకు రూ. 3500 చెల్లించడంతో చాలా మంది రైతులు అక్కడి పరిశ్రమలకు తమ పంటను విక్రయించారు.
వ్యర్థాలతో కర్మాగారాలకు లాభం
చక్కెర ఫ్యాక్టరీలు తమ అమ్మకాల్లో లాభాలను రైతులకు పంచాలి. కానీ ఎక్కడా అది అమలు చేయడం లేదు. చెరుకు గానుగ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు, మొలాసిస్, బెగాస్కు మార్కెట్లో మంచి ధర ఉంటుంది. దీంతో ఈ వ్యర్థాల ధరకు సమానమైన ధర తమకు ఇవ్వాల ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జహీరాబాద్ ట్రైడెంట్ కర్మాగారం పరిధిలోని చెరుకు గానుగకు సిద్ధంగా ఉంది. రాష్ర్టానికి సంబంధించిన ప్రోత్సాహకం ధర రద్దయ్యాక కేంద్రం ఎఫ్ఆర్పీ (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్) విధానాన్ని అమలుల్లోకి తెచ్చి 9.5శాతం రికవరీ కలిపి ధరను నిర్ణయించింది. కేంద్రం ఎస్ఎంపీ (స్టాట్యూటరే మినిమం ప్రైస్) ధరను ప్రకటించేది. రాష్ట్రం తన సలహాధర, చెరుకు పన్ను రూపేణా పొందే డబ్బును ప్రభుత్వం రైతులకే ఇచ్చేది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ చక్కర ఫ్యాక్టరీలు లేకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ప్రకటించే మద్దతు ధర పూర్తిగా పరిశ్రమ యజమానులకు అనుకూలంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2002కు ముందు 8.5శాతం టన్ను చెరుకు గానుగ ఆడిస్తే 85 కిలోల చక్కర ఉత్పత్తి రికవరీపై ధర ప్రకటిస్తుండేవారని రైతులు వివరించారు. గతంలో ఉన్న దానిని 9.5 శాతానికి కేంద్రం పెంచి, ప్రస్తుతం ధరను ప్రకటిస్తున్నది. దీంతో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని అన్నదాతలు పేర్కొన్నారు.
మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం మద్దతు ధర ప్రకటించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో ఎరువులు, కూలీ ఖర్చులు పెరిగిపోవడంతో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కావ డం లేదంటున్నారు. ఈ సీజన్లో చెరుకు మద్దతు ధర పెంచా లని రైతులు కోరుతున్నారు. గత ఏడాది కొత్తూర్(బి) ట్రైడెంట్ చక్కర ఫ్యాక్టరీలో 2,07,28,888 టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ జోన్లో 8568 మంది రైతులు చెరుకు పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 7159.60 మెట్రిక్ టన్నుల చెరుకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాది 10.97 శాతం రికవరీపై టన్ను మద్దతు ధర రూ. 3050
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ రైతులకు గతేడాది 10.97 శాతం చక్కెర రికవరీపై టన్నుకు రూ. 3050 మద్దతు ధర ఇచ్చింది. జహీరాబాద్ ప్రాంతంలో పండే చెరుకులో రికవరీ శాతం అధి కంగా ఉంటుందని చెరుకు పరిశోధనా శాస్ర్తవేత్తలు తెలిపారు. కొత్తూర్(బీ) ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో 10.97శాతం రికవరీ కంటే అధికంగా వస్తుందని వారు వివ రించారు.
జహీరాబాద్ ప్రాంతం చెరుకులో అధికంగా చక్కెర ఉత్పత్తి కావడంతో ఇతర ప్రాంతంలో ఉండే చక్కర ఫ్యాక్టరీలు రైతులకు అధిక ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. జహీరాబాద్ జోన్లో సాగు చేస్తున్న చెరుకును కర్ణాటక, మహారాష్ర్టకు చెందిన ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్న ఫ్యాక్టరీల సైతం కొనుగోలు చేస్తున్నాయి.
చెరుకు రైతుల సంక్షేమానికి కృషి చేస్తా..
ట్రైడెంట్ యాజమాన్యం టన్ను మద్దతు ధర రూ. 3269 ప్రకటించింది. అయితే, ఇది సరిపోదని రైతులు పేర్కొంటున్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి ధర పెంచేలా కృషి చేస్తా. రైతు లు ఎవరూ ఇతర రాష్ర్టాలకు చెరుకును తరలించొద్దు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.
– ఉమాకాంత్ పాటిల్, సీడీసీ చైర్మన్ జహీరాబాద్
రైతులకు నిరాశే మిగులుతోంది..
చెరుకు సాగు చేస్తున్న రైతులకు ప్రతి ఏడాది నిరాశే మిగులుతోంది. ఏటా కూలీల ఖర్చులు, ఎరువులు, యంత్రాల అద్దె అన్నీ పెరుగుతున్నా యి. గతేడాది సాగు ఖర్చులు కూడా రాలేదు. ఈ ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యం మద్దతు ధర పెంచి రైతులకు ఆదుకోవాలి. ఫ్యాక్టరీ వారు చెరుకు నరికేందుకు కూలీలు, రవాణా సౌకర్యం కల్పించాలి.
– సీఎం. మాణిక్రెడ్డి, చెరుకు రైతు పస్తాపూర్
మద్దతు ధర ప్రకటించింది
ట్రైడెంట్ యాజమాన్యం చెరుకు టన్నుకు రూ. 3269 మద్దతు ధర ప్రకటించింది. ఈ సీజన్కు ఈ ధర అమలవుతున్నది. నవంబర్ రెండో వారంలో క్రషింగ్ సీజన్ ప్రారం భించేందుకు యాజమాన్యం ఏర్పా ట్లు చేస్తున్నది. ఇందు కోసం యాజమాన్యం ఏర్పాట్లు చేసిం ది. కూలీలు, రవాణా సౌకర్యాలు కల్పించాలని యాజమా న్యానికి సూచించాం.
– రాజశేఖర్, జిల్లా చెరుకు అభివృద్ధి అధికారి, సంగారెడ్డి