సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 7: జాతీయ పంచాయతీ అవార్డ్సు పోటీలకు అన్ని గ్రామ పంచాయతీలు సరైన వివరాలను నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నేషనల్ పంచాయత్ అవార్డ్స్పై సంబంధిత, అనుబంధ శాఖల అధికారులు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 15తేదీ లోగా ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నావళికి వివరాలను ఎంపీడీవోలకు అందజేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
9 కేటగిరీల్లో అవార్డులను ఎంపిక చేస్తారని, అవార్డుల కోసం నిర్దేశించిన ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నావళిలో ప్రశ్నలను ఒకటి, రెండు సార్లు చదివిన అనంతరం పూర్తి సమాచారాన్ని సక్రమంగా నమోదు చేయాలని ఆయన సూచించారు. మండల స్థాయిలో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో పంచాయతీ కార్యదర్శుల సహకారంతో తప్పులు లేని వివరాలను నమోదు చేయాల్సిన పూర్తి బాధ్యత ఎంపీడీవోలదని వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతి గ్రామ పంచాయతీ పాల్గొనాలని, 9 కేటగిరీల్లో ప్రశ్నావళి ప్రకారం సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీవో, డీఈవో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.