‘తెలంగాణ కోసం పార్టీ పెట్టాడు.. పోరాటం చేశాడు.. ఎవరు ఎన్నెన్ని మాటలన్నా లెక్క చేయకుండా రాష్ర్టాన్ని సాధించాడు.. ఆయన గెలిచాడు.. ప్రజలను గెలిపించాడు.. దేశానికి సేవ చేసేందుకు రంగంలోకి దూకాడు.. దేశంలో ఇక గులాబీ పరిమళించనున్నది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుంది’.. అని పలువురు అభిప్రాయపడ్డారు. బుధవారం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించగా, రెండోరోజూ గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సంబురాలు కొనసాగాయి. ఊరూరా, వాడవాడలా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు మార్మోగాయి. అన్ని ఊళ్లల్లోనూ గులాబీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రికి అభినందనలు వెల్లువెత్తాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అసాధ్యమనుకున్న రాష్ర్టాన్ని సాధించిన నేత సీఎం కేసీఆర్ దేశ భవిష్యత్కు దిక్సూచి అవుతాడన్న విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ‘దేశ్ కా నేత కేసీఆర్’ అంటూ జేజేలు పలుకుతున్నారు.
జాతీయ పార్టీని స్వాగతిస్తూ సంబురాలు
అందోల్,అక్టోబర్ 6 : టీఆర్ఎస్ను,బీఆర్ఎస్గా ప్రకటిస్త్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నేరడిగుంట గ్రామంలో గురువారం టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ లవ్వ కృష్ణాగౌడ్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెలంగాణను తెచ్చిన ధీరుడు, ఇక నుంచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం శుభ సూచకం అన్నారు. దేశ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానకి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు. దేశ సేవ చేయడం కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్న మహనీయుడు కేసీఆర్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పటోళ్ల సంగమేశ్వర్,గొల్ల నారాయణ,గంగాధార్,రవీందర్, శంకర్,బోయిని శంకర్,ఉసిరిక పల్లి వీరయ్య,మన్నె నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : దేశంలో సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరముందని, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ కేక్ను కట్ చేశారు. అనంతరం ఆమె మాటాడారు. తెలంగాణ రాష్ట్ర సమతిగా పార్టీ ఏర్పాటు కోసం 14 ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దేశ ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉదేశ్యంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
దేశానికి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి నాయకత్వం చాలా అవసరం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు జరగడం లేదు. తెలంగాణలోని ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇవే పథకాలు దేశమంతటా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మంచి నాయకత్వం కావాలి.. సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది. రాష్ర్టాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారు అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
-హేమలతా శేఖర్గౌడ్, జడ్పీ చైర్పర్సన్, మెదక్
నవశకానికి నాంది..
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావంతో సీఎం కేసీఆర్ నవశకానికి నాంది పలికారు. విజయదశమి వేళ జాతీయ పార్టీని ప్రకటించడం శుభసూచికం. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నా. సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుంది. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది.. ఇప్పుడు బీఆర్ఎస్తో దేశ ప్రజలకు అండగా నిల్వనున్నది.
– పుష్పానగేశ్, కార్పొరేటర్ (ఆర్సీపురం)
కేసీఆర్ దేశంలోనే గొప్ప నాయకుడు..
సీఎం కేసీఆర్ ఒక తెలంగాణకే పరిమితమైన నాయకుడు కాదు.. దేశంలోనే గొప్ప నాయకుడు. ఆయన సేవలు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతాయి. టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి దేశ ప్రజల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీగా మార్చడం ఎంతో సంతోషంగా ఉన్నది. దేశంలోనే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చిన నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇదో మంచి శుభ పరిణామం.
-తుమ్మల పాండురంగారెడ్డి,మున్సిపల్ చైర్మన్ (అమీన్పూర్)
బీఆర్ఎస్ ఓ సంచలనమవుతుంది..
సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఓ సంచలనమే. అసాధ్యమైన పని సుసాధ్యం చేసే గొప్ప మేధావి కేసీఆర్. ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చి దేశ అభివృద్ధి కోసం మంచి అలోచనగా భావించవచ్చు. అన్ని రాష్ర్టాల ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బీఆర్ఎస్ పార్టీని బలమైన శక్తిగా తయారు చేస్తాడు. పట్టుదల గల వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంత కష్టపడ్డాడో దేశ ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీని సైతం దేశ వ్యాప్తంగా ముందుకు తీసుకుపోయేందుకు అంతే కష్టపడుతాడు.
– దేవానంద్,ఎంపీపీ(అమీన్పూర్) సీఎం కేసీఆర్ ఏదైనా సాధిస్తారు..
దేశ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన మార్క్ని సొంతం చేసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు అందురూ ఆయనతో ఏమైతది.. తెలంగాణ సాధ్యమైతదా..పార్టీ దుకాణం బంద్ అయితది.. అని హేళన చేశారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి వేళ.. వాళ్ల నోర్లు మూయించాడు కేసీఆర్. సార్ ఏదైనా అనుకుంటే అది తప్పనిసరిగా సాధిస్తారు. బీఆర్ఎస్ ఆవిర్భావం శుభసూచికం.
– లలితాసోమిరెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ (ఆర్సీపురం)
దేశానికి సీఎం కేసీఆర్ అవసరం..
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ సేవలు అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. గుజరాత్ మోడల్ను అనుసరించి అన్ని రంగాలను నాశనం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బీజేపీ ప్రభుత్వం నట్టేట ముంచి రైతుల చేత కంటతడి పెట్టించింది. కేసీఆర్ దేశంలో వ్యవసాయరంగాన్ని అందరూ మెచ్చే విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారు.
-మీనాక్షిసాయికుమార్,జడ్పీటీసీ మునిపల్లి
బీజేపీని ఎదుర్కోగల నాయకుడు..
బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేత సీఎం కేసీఆర్. దేశానికి రైతాంగ సమస్యలపై స్పష్టత ఉండి వాటిని పరిష్కరించే సమర్థత ఉన్న నాయకుడు. రైతు ఏడ్చిన.. రాజ్యం ఎన్నడూ బాగుపడలేదని పెద్దల సామెత.. బీజేపీ సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటుంది. సీఎం కేసీఆర్తోనే దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇచ్చిన మాటను అచరణలోకి పెట్టే నేత సీఎంకేసీఆరే ఒక్కరే.
-శైలజాశివశంకర్, ఎంపీపీ (మునిపల్లి)
కేసీఆర్తోనే దేశ భవిష్యత్తు
రాయికోడ్ : కేసీఆర్ లాంటి సమర్థవంత నాయకుడు దేశానికి చాలా అవసరం. దేశానికి తెలంగాణ మోడల్ను పరిచయం చేశారు. నేడు మిగతా రాష్ర్టాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షే మ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాల్సిందే..
-నాజీంపాటిల్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి